తెలంగాణ నుంచే కరోనా వైరస్కు తొలి టీకా వస్తుందని మంత్రి కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. హైదరాబాద్లో ఉన్న భారత్బయోటెక్ సంస్థ నుంచే ఆ టీకా వచ్చే అవకాశాలు ఉన్నట్లు ఆయన అభిప్రాయపడ్డారు. హైదరాబాద్లోని జీనోమ్ వ్యాలీలో ఉన్న భారత్ బయోటెక్ వ్యాక్సిన్ ప్రొడక్షన్ సెంటర్ను రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఇవాళ సందర్శించారు. మంత్రి కేటీఆర్తో పాటు డాక్టర్ ఎల్లా, శ్రీమతి సుచిత్రా ఎల్లా కూడా పాల్గొన్నారు. భారత్ బయోటెక్ సంస్థ ఉద్యోగులతో మంత్రి మాట్లాడారు. సీఎండీ డాక్టర్ కృష్ణా ఎల్లా, తెలంగాణ లైఫ్ సైన్సెస్ అండ్ ఫార్మా డైరక్టర్ శక్తి నాగప్పన్తో కలిసి మంత్రి చర్చను నిర్వహించారు. కరోనా వైరస్ వ్యాక్సిన్ తయారీలో భారత్బయోటెక్ ముందంజంలో ఉండడం గర్వంగా ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. కరోనాకు టీకా తొలుత హైదరాబాద్ నుంచి, అందులో భారత్ బయోటెక్ నుంచి వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
టీకాల అభివృద్ధి, తయారీలో భారత్ భాగస్వామ్యం కీలకమైందని ప్రపంచదేశాలు పదేపదే చెబుతున్నాయని, ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ అవసరాల దృష్ట్యా హైదరాబాద్ ప్రాముఖ్యత కూడా పెరిగినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ నుంచి మూడవ వంత వ్యాక్సిన్ ప్రపంచ దేశాలకు అందించడం గర్వంగా ఉందన్నారు. మీ అందరి నిరంతర కృషి వల్లే ఇది సాధ్యమవుతోందని మంత్రి తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ కూడా మంత్రి కేటీఆర్ నిర్వహించిన చర్చలో పాల్గొన్నారు.