కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ నంది ఎల్లయ్య కన్నుమూశారు. జూలై 29న అనారోగ్యంతో నిమ్స్లో చేరిన నంది ఎల్లయ్య.. శనివారం ఉదయం 10.30 గంటలకు తుది శ్వాస విడిచారు.
అనారోగ్యంతో బాధ పడుతూ నిమ్స్లో చేరగా పరీక్షల అనంతరం కరోనా పాజిటివ్గా నిర్దారించారు. 10 రోజుల పాటు చికిత్స అనంతరం మృతి చెందారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
నంది ఎల్లయ్య లోక్సభ ఎంపీగా ఆరు సార్లు గెలుపొందారు. ఒకసారి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహించారు. సిద్దిపేట లోక్సభ నియోజకవర్గం నుంచి ఐదు సార్లు, నాగర్ కర్నూల్ నియోజకవర్గం నుంచి ఒకసారి గెలుపొందారు.
1942 జూలై 1న హైదరాబాద్లోని బోలక్పూర్లో ఎల్లయ్య జన్మించారు. మెట్రిక్యులేషన్ వరకు చదువుకున్న ఆయన.. ఒక్కో మెట్టు ఎక్కుతూ ఉన్నతస్థాయికి చేరారు. ఆయన ప్రస్తుతం పార్టీకి ఉపాధ్యక్షులుగా ఉన్నారు.
నిరాడంబరత, నిజాయితీలకు మారుపేరుగా ఆయన గురించి చెబుతుంటారు. ఆయన మృతిపట్ల కాంగ్రెస్ పార్టీ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతికి తీవ్ర సంతాపం వెలిబుచ్చిన నేతలు, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.