ఈనెల 14వ తేదీన ఉదయం 9.30 గంటలకు నగరంలో మరో 26 బస్తీ దవాఖానాలను ప్రారంభిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు.
పేద ప్రజలకు వైద్య సేవలు చేరువ చేసేందుకే బస్తీ దవాఖానలను ఏర్పాటు చేయడం జరిగిందని మంత్రి తెలిపారు. జీహెచ్ంఎంసీ పరిధిలో 300 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వం లక్ష్యం అని పేర్కొన్నారు.
ప్రస్తుతం 170 బస్తీ దవాఖానాల ద్వారా ప్రజలకు వైద్యం అందుతోందని ఆయన చెప్పుకొచ్చారు. బస్తీ దవాఖానల ప్రారంభం ఏర్పాట్లపై మసాబ్ ట్యాంక్లోని తన కార్యాలయంలో మంగళవారం మంత్రి తలసాని శ్రీనివాస్ సమీక్ష నిర్వహించారు.
ఈ సమీక్షలో జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, హైదరాబాద్ కలెక్టర్ శ్వేత మహంతి, రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ ప్రతీక్ జైన్, మూడు జిల్లాల వైద్యాధికారులు పాల్గొన్నారు.
ఈ బస్తీ దవాఖానాలను డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, హోంమంత్రి మహమూద్ అలీ, మేయర్, డిప్యూటీ మేయర్లు ప్రారంభించనున్నారు