ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఇటీవల కాస్త ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సిక్కా రాజీనామా, శేషసాయి లేఖ తదితర వివాదాలు కార్పొరేట్ రంగంలో చర్చకు దారితీశాయి. ఇవన్నీ సంస్థ ఉద్యోగ నియామకాలపై ప్రభావం చూపవని చెబుతోంది ఇన్ఫోసిస్. వచ్చే రెండేళ్లలో ఏటా ఆరు వేల మందికిపైగా కొత్త ఇంజినీర్లకు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు కంపెనీ తెలిపింది. మరోపక్క ఉద్యోగ వీసాకు సంబంధించి వివాదాలు ఉన్నా, యూఎస్, యూరోపియన్ మార్కెట్లో ఉద్యోగ నియామక ప్రక్రియను కొనసాగించనున్నట్లు వెల్లడించింది.
‘నియామక ప్రక్రియను కొనసాగిస్తాం. ఈ ఏడాది కొత్తగా ఆరు వేలమందికి ఉపాధి కల్పించనున్నాం. వచ్చే రెండేళ్లలో కూడా ఇదే విధంగా నియామకాలు ఉంటాయి. అయితే అవి కంపెనీ వృద్ధిని బట్టి ఉంటాయి’ అని సంస్థ తాత్కాలిక సీఈవో, ఎండీ యూబీ ప్రవీణ్రావు అన్నారు. ఏటా 10లక్షల మంది గ్రాడ్యుయేట్లు విశ్వవిద్యాలయాల నుంచి బయటకు వస్తున్నారని, వీరిలో కేవలం 20-30శాతం మంది మాత్రమే ప్రతిభ కలిగిన వారు ఉంటున్నారన్నారు. అలాంటి వారి కోసం తమతో పాటు, ఇతర కంపెనీలు పోటీపడతాయని తెలిపారు. జూన్ 2017 నాటికి ఇన్ఫోసిస్లో మొత్తం 1,98,553మంది ఉద్యోగులు ఉన్నారు.
ఇన్ఫోసిస్లో గత కొన్ని నెలులుగా వివాదాలు తారాస్థాయికి చేరాయి. ముఖ్యంగా 200 మిలియన్ డాలర్ల వెచ్చించి పనయా కొనుగోలుకు సంబంధించి వ్యవస్థాపకులు, బోర్డు సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తిన సంగతి తెలిసిందే. దీంతో సీఈవో విశాల్సిక్కా, ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ ఆర్.శేషసాయి సహా ముగ్గురు బోర్డు సభ్యులు సంస్థను నుంచి తప్పుకొన్నారు. దీంతో సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకనిని నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ నియమించారు.