రాజకీయాల్లో ఫిరాయింపులు స్వప్రయోజనాల కోసం చేసినప్పుడు వాటి ఫలితం విమర్శల రూపంలోనే కాదు అనుభవపూర్వకంగా కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందని ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమెల్యే అశోక్ రెడ్డికి తెలిసి వచ్చింది. ఇంటింటికి టిడిపి ప్రోగ్రాం పేరుతో అధికార పార్టీ ఎంతో ఆర్భాటంగా జరుపుతున్న కార్యక్రమంలో ఈయన కూడా పాల్గొంటున్నారు. అందులో భాగంగా రాచర్ల మండలం అనుమనపల్లె అనే గ్రామానికి వెళ్లారు. యధావిదిగానే టిడిపి గురించి భజన చేస్తూ చేయని అభివృద్ధి గురించి మాటలు చెప్పడం మొదలు పెట్టారు. ఇంతలో ఒక పౌరుడు నేరుగా అశోక్ రెడ్డి వద్దకే వచ్చి ఇప్పటి దాకా మీరు చేసిన అభివృద్ధి ఏంటో చూపించాలని నిలదీయటంతో సదరు ఎమెల్యేకి నోట మాట రాని పరిస్థితి. అడిగింది ప్రతిపక్ష పార్టీ వాడు అనుకునేరు. సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ అభిమాని, కార్యకర్త ఈ ప్రశ్న వేసాడు.
దీంతో సమాధానం ఏం చెప్పాలో అర్థం కాక నీళ్ళు నమిలిన అశోక్ రెడ్డి అక్కడి నుంచి పలాయన మంత్రం చిత్తగించి అక్కడి నుంచి జారుకున్నారు. అసలు అశోక్ రెడ్డి ఎన్నికల్లో గెలిచింది వైసిపి గుర్తు మీద. టిడిపి అధికారంలోకి రాగానే జంప్ జిలాని చేసారు. అది ఎందుకో ప్రత్యేకంగా కారణలు అక్కర్లేదు. ఇప్పుడు టిడిపి కార్యకర్తే నిలదీయడానికి కారణం కూడా అదే. అభివృద్ధి కోసం పార్టీ మారాను అని చెప్పుకున్నప్పుడు అది చేతల్లో చేసి చూపించాలి కాని ఇలా పంప్లెట్లు పట్టుకుని గడప గడపకు తిరగడం కాదని కౌంటర్ వేస్తున్నారు. ఈ వ్యవహారం అందరి ముందు జరగడంతో ఎమెల్యే ఏమి అనలేని పరిస్థితి. దీంతో పోలీసులు ఆ కార్యకర్తను పక్కకు తీసుకెళ్ళి నచ్చజెప్పి పంపించేసారు. అంతే మరి. స్వార్థం జెండా మారిస్తే ప్రతి ఒక్కరికి జవాబు చెప్పే తీరాలి.