ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) క్రికెట్లో కీలక మార్పులు చేసింది. ఈ కొత్త నిబంధనలన్నీ ఈ నెల 28 నుంచి అమల్లోకి రానున్నాయి. బ్యాట్ కొలతలు, దురుసుగా ప్రవర్తించే ప్లేయర్స్ను బయటకు పంపించేయడంతోపాటు డెసిషన్ రీవ్యూ సిస్టమ్లోనూ కీలక మార్పులు చేసింది. సౌతాఫ్రికా, బంగ్లాదేశ్.. పాకిస్థాన్, శ్రీలంక టెస్ట్ సిరీస్ల నుంచి ఈ కొత్త రూల్స్ను అమలు చేస్తారు. ఎంసీసీ లాస్ ఆఫ్ క్రికెట్కు మార్పులు చేయడంతో ఐసీసీ ప్లేయింగ్ కండిషన్స్ను మార్చినట్లు ఐసీసీ జనరల్ మేనేజర్ జెఫ్ అలార్డైస్ వెల్లడించారు. ఈ కొత్త నిబంధనలపై అంపైర్లకు వర్క్షాప్ కూడా నిర్వహించామని, ఇక ఇంటర్నేషనల్ క్రికెట్లో వాటిని ప్రవేశపెట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు.
అటు బ్యాట్స్మెన్, ఇటు బౌలర్లు ఇద్దరికీ అనుకూలించేలా కొత్త నిబంధనలను రూపొందించారు. ఇందులో భాగంగా బ్యాట్ మందం, అంచుల్లో మార్పులు చేశారు. బ్యాట్ పొడువు, వెడల్పులో ఎలాంటి మార్పు లేదు. అయితే మందం మాత్రం 40 ఎంఎం కన్నా ఎక్కువ ఉండకూడదు. అంపైర్లకు బ్యాట్ గేజ్ ఇవ్వనున్నారు. దీనితో వాళ్లు బ్యాట్ కొలతలను చూడొచ్చు. దురుసుగా ప్రవర్తించే ప్లేయర్స్ను అప్పటికప్పుడు గ్రౌండ్ నుంచి పంపించే హక్కు అంపైర్లకు ఉంటుంది. ఏ ప్లేయర్ అయినా తీవ్ర తప్పిదానికి పాల్పడ్డాడని అంపైర్ భావిస్తే అతన్ని లెవల్ 4 తప్పిదం కింద మిగతా మ్యాచ్ ఆడకుండా బయటకు పంపొచ్చు. అంపైర్పై చేయి చేసుకొనే ప్రయత్నం చేయడం, కావాలని అంపైర్ను ఢీకొట్టడం, సాటి ప్లేయర్పై దాడి చేయడం వంటివన్నీ లెవల్ 4 తప్పిదాల కిందికి వస్తాయి.