దేశ ప్రధాని నరేద్ర మోడీపై విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మోదీ నాకంటే పెద్దనటుడని విమర్శించారు. బెంగుళూరు సీనియర్ జర్నలిస్టు గౌరీ లంకేష్ హత్యపై ప్రధాని నరేంద్ర మోదీ వెంటనే స్పందించాలని విలక్షణ నటుడు ప్రకాశ్రాజ్ డిమాండ్ చేశారు. ఈ హత్యపై ప్రధాని స్పందించకపోతే, తనకు ప్రభుత్వం ఇచ్చిన జాతీయ అవార్డులను వెనక్కు ఇచ్చేస్తానని హెచ్చరించారు. ప్రకాశ్రాజ్ గతంలోనూ గౌరీ లంకేష్ హత్యపై స్పందించిన సంగతి తెలిసిందే. ఆమె హత్యకు కారణమైన వారిని అరెస్ట్ చేసి చట్టం ముందు నిలపకుంటే తాను నిరసనకు దిగుతానని ఆయన కన్నడ సర్కారును హెచ్చరించారు. గత నెలలో తన ఇంటిముందే గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో గౌరి హత్యకు గురికాగా, ఇంతవరకూ హంతకులు ఎవరన్న విషయం విచారిస్తున్న అధికారులకు అంతుబట్టడంలేదు.
గౌరీ లంకేష్ హత్యపై ప్రధాని మౌనం వీడాలని, దీనిపై సామాజిక మాధ్యమాల్లో కొందరు సంబరాలు చేసుకుంటున్నారని విమర్శించారు. అమెను హత్యకు కారణమైన వారిని ఇప్పటి వరకు గుర్తించపోగా.. కొందరు మాత్రం సంబరాలు జరుపుకోవడం మరింత బాధ కలిగిస్తుందని ప్రకాశ్రాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. వీళ్లను ప్రధాని తన ట్విట్టర్లో అనుసరిస్తున్నారు.. అయినా ఆయన పట్టించుకోవడం లేదని ఆరోపించారు. పనిలో పనిగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్పై కూడా ప్రకాశ్రాజ్ విమర్శలు గుప్పించారు. దసరా సందర్భంగా ఆలయంలో యోగి పూజలు చేయడాన్ని తప్పుబట్టారు. ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రా లేదా గుడిలో పూజారా అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గౌరీ లంకేష్తో ప్రకాశ్రాజ్కు గత మూడు దశాబ్దాలు స్నేహం కొనసాగుతోంది. గౌరీ తండ్రి లంకేష్ మా గురువని, మేము ఆమెవిద్యార్థులమని, వారి గురించి 35 ఏళ్లుగా తెలుసని ఆమె హత్య తర్వాత ఇటీవల రిపబ్లికన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.