ప్రముఖ సినీ నటుడు రచయిత ఎంవీఎస్ హరనాథరావు(72) కన్నుమూశారు. గుండెపోటు రావడంతో ఆయన్ని ఒంగోలులోని రిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. 150కు పైగా సినిమాలకు మాటలు అందించిన హరనాథరావు.. ప్రతిఘటన, భారతనారి, అన్న, అమ్మాయి కాపురం సినిమాలకు నంది పురస్కారాల్ని గెలుపొందారు. ప్రముఖ దర్శకుడు టి.కృష్ణ ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయిన హరనాథరావు.. దేశంలో దొంగలు పడ్డారు, ఇదా ప్రపంచం, దేవాలయం, రేపటి పౌరులు, మంచిదొంగ, యుద్ధభూమి, రాక్షసుడు, రామాయణం, ధర్మచక్రం, ఇన్స్పెక్టర్ ప్రతాప్ వంటి సినిమాలకు మాటలు అందించారు.
అలాగే రాక్షసుడు, స్వయంకృషి వంటి సినిమాల్లోనూ.. రక్తబలి, జగన్నాథ రథచక్రాలు, క్షీరసాగర మథనం, అంతం కాదిది ఆరంభం వంటి నాటకాల్లోనూ హరనాథరావు నటించారు. 1948 జులై 27న గుంటూరులో హరనాథరావు జన్మించారు. గుంటూరులోనే విద్యాభ్యాసం సాగింది. హరనాథరావుకు చిన్నప్పటినుంచే నాటకాల అంటే అభిమానం. చిన్నప్పుడు పలు నాటకాల్లో నటించిన ఆయన.. అనంతరం పలు నాటకాలు రచించారు. కాలేజీ రోజుల్లో దర్శకుడు టి.కృష్ణ, హరనాథరావు మంచి స్నేహితులు. ఈ అనుబంధంతోనే టి.కృష్ణ ద్వారా హరనాథరావు వెండితెరకు పరిచయమయ్యారు.