దాదాపు ఐదు దశాబ్దాలపాటు పదివేలమందికి పైగా ఉపాధి కల్పించి, వరంగల్ నగరానికి కరెంటును కూడా సరఫరాచేసి.. వలసపాలకుల కూటనీతికి చరిత్రగా మారిపోయిన ఆజంజాహి మిల్లును మరిపించేరీతిలో మెగా టెక్స్టైల్ పార్కు ఏర్పాటు చేయాలన్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు సంకల్పం ఇప్పుడు సాకారమవుతున్నది. నాటి ఆజంజాహికి ఆరురెట్లు అధిక విస్తీర్ణంలో.. దేశ, విదేశీ సంస్థల భాగస్వామ్యంతో.. రూ.11వేల కోట్ల పెట్టుబడులతో.. దాదాపు రెండు లక్షలమందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి కల్పన లక్ష్యంగా.. అంతర్జాతీయ ప్రమాణాలతో మెగా టెక్స్టైల్ పార్కుకు రూపకల్పనచేసిన ఘనత నిస్సందేహంగా సీఎం కేసీఆర్కే దక్కుతుంది.
దేశంలో పత్త్తి ఉత్పత్తి చేస్తున్న రాష్ర్టాల్లో తెలంగాణది మూడోస్థానం. మనరాష్ట్రంలో ఏటా దాదాపు 50లక్షల బేళ్ల పత్తి ఉత్పత్తి అవుతున్నది. ఇందులో మనం వినియోగించుకుంటున్నది పట్టుమని 20శాతమైనా లేదు. మిగతాదంతా ప్రాసెసింగ్లో భాగంగా ఇతర రాష్ర్టాలకు తరలిపోతున్నది. అక్కడి నుంచి చైనా, బంగ్లాదేశ్లలోని భారీ టెక్స్టైల్ పరిశ్రమలకు ఎగుమతి అవుతున్నది. తెలంగాణలో పత్తి రైతుకు లభిస్తున్నది ఏమీ లేదు. పత్తిని కొనుగోలు చేసిన మధ్యవర్తులు, వాటిని ప్రాసెసింగ్ చేసి విదేశాలకు తరలిస్తున్న వ్యాపారులకు మాత్రం ఇబ్బడిముబ్బడిగా లాభాలు దక్కుతున్నాయి. ముడిపత్తి ఉన్నప్పటికీ మనవద్ద పరిశ్రమలు లేక వాటి ఆదాయాన్ని నేరుగా పొందలేకపోతున్నాం. మన నేత కార్మికులు వలసలు పోతున్నారు. ఈ దుస్థితికి చరమగీతం పాడేందుకే సీఎం కేసీఆర్ టెక్స్టైల్పార్కు ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. రెండేండ్ల తర్వాత ఇప్పుడా కలల ప్రాజెక్టుకు ఈ నెల 22న సీఎం స్వయంగా శంకుస్థాపన చేస్తున్నారు.
వరంగల్ రూరల్ జిల్లాలోని పరకాల నియోజకవర్గం పరిధిలోని రెండుమండలాల పరిధిలో కాకతీయ మెగా టెక్స్టైల్పార్కు ఏర్పాటు అవుతున్నది. ఇందుకోసం గీసుకొండ మండలంలోని శాయంపేట హవేలి, సంగెం మండలంలోని చింతలపల్లి గ్రామాల మధ్య 1,190 ఎకరాల భూమిని రూ.87.78కోట్లు వెచ్చించి సేకరించారు. 731మంది పట్టాదార్లు స్వచ్ఛందంగా భూమిని ఇచ్చారు. సేకరించిన భూమిలో ఉన్న 170.35ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని పార్కుకు బదలాయించారు. ఇందులో 172యూనిట్ల స్థాపన అంచనాల ప్రణాళికలను టీఎస్ఐఐసీ రూపొందించింది. మొదటిదశలో 265ఎకరాలు, రెండోదశలో 235ఎకరాలు, మూడో దశలో 220ఎకరాలు, నాలుగో దశలో 230ఎకరాలు, ఐదోదశలో 240ఎకరాల్లో పరిశ్రమలు ఏర్పాటుచేస్తారు. 63% (750 ఎకరాలు) పరిశ్రమలకు, మౌలిక సదుపాయాల కోసం 80 ఎకరాలు, ఇతర సౌకర్యాలకు 50 ఎకరాలు, అంతర్గత రవాణాకోసం 179 ఎకరాలు కేటాయించారు. భవిష్యత్ అవసరాలకు 130 ఎకరాల భూమిని ఖాళీగా ఉంచుతున్నారు.
పొల్యూషన్ ఫ్రీ ట్రీట్మెంట్ ప్లాంట్
మెగా టెక్స్టైల్ పార్కులో గాలి, నీరు కలుషితం కాకుండా చర్యలు తీసుకుంటున్నారు. వస్ర్తాల తయారీలో పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థాలను అక్కడికక్కడే ట్రీట్మెంట్ప్లాంటులో పునర్వినియోగానికి ఉపయోగించేలా జాగ్రత్తలు తీసుకోబోతున్నారు. మురుగునీటి నిర్వహణ కోసం రూ.40కోట్లతో ప్రణాళిక సిద్ధంచేశారు. పార్కుస్థలంలో ఉన్న రెండు చెరువులను రిజర్వు పాయింట్లుగా మారుస్తారు. నిరంతర విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ (ఎన్పీడీసీఎల్) సిద్ధమయింది. కొత్త స్తంభాల ఏర్పా టు, సబ్ స్టేషన్ల నిర్మాణం, నూతన లైన్ల ఏర్పాటుకు రూ.71కోట్లు ఖర్చు అవుతుందని నిర్ణయించారు.
అంతర్జాతీయస్థాయి పరిశ్రమలు ఏర్పాటు అవుతున్న నేపథ్యంలో వచ్చే రెండేండ్లలో నైపుణ్యం గల వ్యక్తులను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు పరిశ్రమలశాఖ భారీ కసరత్తునే ప్రారంభించింది. కోయంబత్తూరులో ప్రముఖమైన విద్యాసంస్థ పీఎస్జీతో టెక్స్టైల్ కళాశాల ఏర్పాటుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. టీఎస్ఐఐసీ, రాంకీ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన డీపీఆర్(డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్)లో ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి కల్పన 1,84,539 మందిగా పేర్కొంది. సాధారణ సేవల్లో మరో మూడు వేలమందికి అవకాశం ఉంటుందని తెలిపింది. పరిశ్రమలకు అవసరమయ్యే నీళ్లను దేవాదుల ఎత్తిపోతల పథకం, ఎస్సారెస్పీ కెనాల్ ద్వారా టెక్స్టైల్ పార్కుకు పంపింగ్ చేయనున్నారు. టెక్స్టైల్ పార్కు దేశానికే తలమానికంగా మారనుందని పర్కాల శాసనసభ్యుడు చల్లా ధర్మారెడ్డి అన్నారు. భూములిచ్చిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం అండగా నిలుస్తుందని చెప్పారు.
రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు ప్రత్యేక కార్యాచరణతో టెక్స్టైల్పార్కు ఏర్పాటుపై కసరత్తు చేశారు. తిర్పూర్, కోయంబత్తూరు ప్రాంతాల్లోని వస్త్రపరిశ్రమల యాజమాన్యాలతో కీలకఒప్పందాలు కుదుర్చుకున్నారు. వస్ర్తాలు, లుంగీలు, దుప్పట్లు వంటి తయారీ యూనిట్లతోపాటు స్పిన్నింగ్, జిన్నింగ్ యూనిట్లను ఒక క్రమపద్ధతిలో స్థాపించేలా మ్యాప్లను సిద్ధంచేస్తున్నారు. మొత్తం రూ.11వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని టీఎస్ఐఐసీ, పరిశ్రమలశాఖ ప్రాథమికంగా అంచనాలు వేసింది. ఐదు దశల్లో స్పిన్నింగ్, టెక్స్టైల్, వీవింగ్, నిట్టింగ్ ప్రాసెసింగ్, ఊవెన్ ఫ్యాబ్రిక్, యార్న్ డైయింగ్, టవల్ – షీటింగ్, ప్రింటింగ్ యూనిట్లు, రెడీమేడ్ వస్ర్తాలు వంటి తొమ్మిది విభాగాల్లో భిన్నమైన పరిశ్రమలు కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుకు రానున్నాయి. ఫాం టూ ఫ్యాషన్ విధానంతో రూపొందుతున్న వస్త్రనగరిలో జాతీయస్థాయి శిక్షణ సంస్థలు, టెక్స్టైల్ కళాశాల ఏర్పాటవుతాయి.