ప్రపంచవ్యాప్తంగా బడా పరిశ్రమల ఏర్పాటుకు కేరాప్ అడ్రస్గా మారిన తెలంగాణలోకి మరో బడా వ్యాపార కేంద్రం రానుంది. మెదక్ జిల్లా తూప్రాన్లో అతి పెద్ద ఆహార (ఫుడ్ ప్రాసెసింగ్) పరిశ్రమ రాబోతుంది. ఈ రంగంలో దేశంలోనే ప్రతిష్ఠాత్మక సంస్థ అయిన ఆర్పీ సంజీవ్ గోయెంకా గ్రూపు రూ.200 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చింది. సోమవారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు కోల్కతా పర్యటనలో.. గ్రూపు చైర్మన్ సంజీవ్ గోయెంకాతో సమావేశమయ్యారు.
మెదక్ జిల్లా తూప్రాన్ వద్ద 20 ఎకరాల్లో ఈ ఆహార పరిశ్రమను గోయెంకా గ్రూపు ఏర్పాటు చేయనుంది. ఈ పరిశ్రమ ద్వారా ఈ-విటా, టూ-యమ్మీ బ్రాండ్లను తయారు చేయనున్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్.. ఫుడ్ ప్రాసెసింగ్, ప్యాకేజింగ్ రంగాల్లో తెలంగాణ రైతులకు సహకారం అందించాల్సిందిగా గోయెంకాను కోరారు. తమ ఉత్పత్తులను మార్కెట్ ధరకు అమ్ముకొనేలా స్థానిక రైతుల కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసేందుకు గోయెంకా గ్రూపు అంగీకరించింది.
తెలంగాణ ప్రభుత్వ విధానాలు, రాష్ట్రంలో ఉన్న వనరులు, అవకాశాలను గుర్తించి రూ.200 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన సంజీవ్ గోయెంకా గ్రూపునకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు. ఈ పరిశ్రమ ఏర్పాటు ద్వారా దాదాపుగా వెయ్యిమందికి ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.