తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.టి. రామారావుకు మరొక ప్రతిష్టాత్మకమైన ఆహ్వానం అందింది. అబుదాబి భారత రాయబార కార్యాలయం, దుబాయ్ మరియు యూఏఈ లోని ప్రముఖ పారిశ్రామిక సంఘం బిజినెస్ లీడర్స్ ఫోరమ్ నిర్వహించనున్న ఇండియా-యూఏఈ భాగస్వామ్య సదస్సుకు ఆహ్వానం లభించింది. ఈ సమావేశంలో భారతదేశంతోపాటు గల్ఫ్ లోని ప్రముఖ పారిశ్రామికవేత్తలు, అధికారులు, పెట్టుబడిదారులు, విద్యావేత్తలు సుమారు ఎనిమిది వందల మందికిపైగా పాల్గొననున్నారు.
దుబాయ్, యూఏఈ దేశాలతో భారత దేశ వాణిజ్య వ్యాపార సంబంధాలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు భారత రాయబార కార్యాలయం తెలిపింది. ఈ నెల 30,31 తేదిల్లో ఈ సమావేశం దుబాయ్ లో జరగనున్నది. 30న జరిగే మంత్రుల స్ధాయి సెషన్లో పాల్గొనాల్సిందిగా మంత్రి కె.టి. రామారావును నిర్వాహకులు కోరారు.
ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ఉండాల్సిన వ్యూహాత్మక వ్యాపార భాగస్వామ్యం, పెట్టుబడులు, పాలసీలు, టూరిజం వంటి అంశాలపైన మాట్లాడాల్సిందిగా కోరారు. దీంతోపాటు తెలంగాణలోని ఉన్న పెట్టుబడుల అవకాశాలు, ప్రభుత్వ పారిశ్రామిక పాలసీలపైన ప్రసంగించాలని కోరారు.
ఇప్పటికే ఈ సమావేశంలో పాల్గొనాల్సిందిగా బిజినెస్ లీడర్స్ ఫోరమ్ మంత్రి కేటీఆర్ కు ఆహ్వానం పంపింది