తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి వివాదం మరింతగా ముదిరింది. టీడీపీ పదవుల నుండి రేవంత్ రెడ్డిను సస్పెండ్ చేయాలని కోరుతూ రాష్ట్ర టీడీపీ పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణ స్వయంగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు లేఖ రాయడంపై రేవంత్ స్పందించారు.
ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ “రాష్ట్ర పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, అసెంబ్లీ నేత హోదాలో ఏకంగా లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ కు కాల్ చేశారు. రేపు ఉదయం అసెంబ్లీలో టీడీపీ ఎల్పీ సమావేశానికి రావాలని ప్రజా ప్రతినిధులను ఆహ్వానించా అని అన్నారు .అంతే కాకుండా టీడీఎల్పీ ఫ్లోర్ లీడర్ ను తానేనని, తన సమావేశాన్ని అడ్డుకునే హక్కు ఎవరికీ లేదని ఈ సందర్భంగా రేవంత్ వ్యాఖ్యానించడం గమనార్హం.
తన వెంట నడిచే వాళ్లు తనతోనే ఉంటారన్న నమ్మకం ఉందని ఆయన అన్నారు. అయితే ప్రస్తుతం టీడీపీ తరఫున రేవంత్ తో పాటు ఆర్ కృష్ణయ్య, సండ్ర వెంకటవీరయ్యలు మాత్రమే ఎమ్మెల్యేలుగా ఉన్నారన్న సంగతి తెలిసిందే. వీరిద్దరిలో ఎవరు రేపు రేవంత్ వెంట నిలుస్తారన్నది సస్పెన్స్ .