తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తరువాత గత మూడేళ్లలో దాదాపు 96 వేల మందికి ముఖ్యమంత్రి సహాయనిధి నుండి సహాయం అందింది. ఒక వైపు అక్రమాలను అరికడుతూనే మరో వైపు సామాన్యుల చెంతకు సహాయం చేరాలన్న ప్రభుత్వ లక్ష్యం అనేక మంది జీవితాలలో వెలుగులు నింపుతోంది.
పదేళ్ల క్రితం ఓ రోజు నిమ్స్ లో మిత్రుడి బంధువులకు ఆపరేషన్. చేతిలో డబ్బుల్లేవు ఏం చేద్దాం అంటే ముఖ్యమంత్రి సహాయనిధి కోసం ప్రయత్నిద్దాం అని ధైర్యం చెప్పి ఓ మిత్రుడిని సంప్రదించాను. సరే ఫలానా ఎమ్మెల్యే వద్దకు వెళ్దాం ధరఖాస్తు తీసుకుని రా అని చెప్పాడు. ఈ లోపు మిత్రుడు నిమ్స్ ఆసుపత్రి పక్కన జిరాక్స్ సెంటర్ కు వెళ్లి ముఖ్యమంత్రి సహాయనిధి ధరఖాస్తు అడగ్గానే బ్రోకర్ ఉన్నాడు ఐదు వేలు ఇస్తే పనవుతుంది అని చెప్పాడట. విధిలేని పరిస్థితిలో మూడు వేలకు మిత్రుడు కమిట్ అయ్యాడు.
ఓ రోజు ఉదయం బ్రోకర్ రమ్మన్న టైముకు వెళ్లి ధరఖాస్తు ఫారం చేతికి ఇవ్వగానే దానిని చింపేసి ఓ తెల్లకాగితం మీద పేరు అడ్రస్ రాసి దాని వెనక రేషన్ కార్డు జతచేశాడు. నిమ్స్ లో ఇలాంటి నిస్సహాయ పరిస్థితులలోనే ఉన్న ఓ ఆరుగురిని కలిపి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి ఆటో మాట్లాడించి పంపించాడు. అక్కడ బాధితుల చేతి నుండే నేరుగా ముఖ్యమంత్రికి ధరఖాస్తు ఇప్పించాడు. ఆ తరువాత సచివాలయానికి పత్రాలు చేరగానే అక్కడికి వెళ్లి నాలుగు రోజుల్లో పని చేయించి 70 వేలకు ఎస్టిమేషన్ కాపీ ఇస్తే 60 వేల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు ఎల్ఓసి కాపీ చేతిలో పెట్టాడు.
ఆ తరువాత కొన్నాళ్లకు మిత్రుడికి కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడని, డయాలసిస్ జరుగుతుందని ముఖ్యమంత్రి సహాయనిధి కోసం ప్రయత్నిస్తున్నామని ఒక మిత్రుడు తెలిపాడు. గతంలో నిమ్స్ సమీపంలో ఉండే బ్రోకర్ విషయం గుర్తుకొచ్చి తనకు చెప్పాను. లేదు లేదు మాజీ ఎంపీ, ఆ తరువాత ఎమ్మెల్యే అయిన అతను ముఖ్యమంత్రికి సన్నిహితుడు అని, నేరుగా సచివాలయం వీరిని తీసుకెళ్లి చెప్పాడని ముఖ్యమంత్రి సహాయనిధి గురించి ఢోకా లేదని తెలిపాడు. ఆ తరువాత కొన్నాళ్లకు కలిసిన మిత్రుడు అన్నా మోసం జరిగిందే .. రెండు లక్షల రూపాయల బిల్లులు పెడితే 30 వేలు వచ్చాయని వాపోయాడు.
ఈ రెండు సంఘటనలలో లంచం ఇవ్వడం తప్పా ? ఒప్పా ? అన్న విషయాన్ని పక్కన పెడితే గత ప్రభుత్వాలలో ఉన్న ధైన్య పరిస్థితిని, దళారీ వ్యవహారాన్ని ఎత్తి చూపడమే ప్రధాన ఉద్దేశం. అప్పుడు ముఖ్యమంత్రి సహాయనిధి అంటే ప్రజలకు ఏంటో తెలియని బ్రహ్మపదార్థం. వైఎస్ హయాంలో ఈ పదం కొంత వరకు సామాన్యుల చెంతకు చేరినా అందులో దుర్వినియోగం కూడా అంతే జరిగింది. ప్రైవేటు ఆసుపత్రులలో దొంగ బిల్లులు సృష్టించి దళారులు దింగమింగిన దాఖలాలు కోకొల్లలు. అయితే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత పరిస్థితి మారింది. స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు ధరఖాస్తులు పంపిస్తే తిరిగి అక్కడికే చెక్కులు పంపి బాధితులకు అందజేయడం జరుగుతుంది. దీనికి ధరఖాస్తు చేయడానికి హైదరాబాద్ కో, ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికో వెళ్లే ప్రయాస తప్పింది. సామాన్యుడి చెంతకు సహాయనిధి చేరుతుంది అన్నది నిర్వివాదాంశం.
ఆ మధ్య ఉప్పల్ హబ్సిగూడకు చెందిన యువకుడు నవీన్ కుమార్ కు గుండె శస్త్రచికిత్స చేయాల్సి ఉంది. భారీమొత్తంలో ఖర్చు అవుతున్నందున ఉప్పల్ ఎమ్మెల్యే ఎన్వీవీఎస్ ప్రభాకర్ ని కలిశాడు. ఆయన ముఖ్యమంత్రి సహాయనిధికి ధరఖాస్తు చేయించి ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి ఈ విషయం తీసుకెళ్లారు. నిబంధనలను పక్కనపెట్టి ఏకంగా 29 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి కేసీఆర్ మంజూరు చేశారు. అంత మొత్తం మంజూరును నమ్మలేని ఎమ్మెల్యే ప్రభాకర్ ఆశ్చర్యపోయి కేసీఆర్ మానవత్వాన్ని ఆకాశానికి ఎత్తేశారు.
ఇవన్నీ ఒక వైపయితే సూడాన్ దేశానికి చెందిన 63 మంది విద్యార్థులు హైదరాబాద్ లో చదువుకుంటున్నారు. వారి దేశంలో అంతర్యుద్దం కారణంగా డబ్బులు రాక ఇక్కడ వారి చదువు మధ్యలోనే ఆగిపోయే పరిస్థితి నెలకొంది. ఈ విషయం ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి రావడంతో వారికి రూ.19 లక్షల రూపాయలు మంజూరు చేయాలని ఆదేశించారు. దేశంకాని దేశంలో ఇంత పెద్ద మొత్తం తమ చదువులు ముందుకు సాగేందుకు సహాయం చేసిన తెలంగాణ ప్రభుత్వ గొప్పమనసు చూసి ఆ విద్యార్థులు ఎంతో సంతోషించారు. ఈ మొత్తానికి రంగారెడ్డి కలెక్టరేట్ లో గత జులైలో అందజేయడం గమనార్హం. ఇక ప్రైవేటు ఆసుపత్రులలో సిబ్బంది సహకారంతో నకిలీ బిల్లులతో ముఖ్యమంత్రి సహాయనిధి నుండి అక్రమంగా డబ్బులు కొల్లగొట్టిన విషయంలో సీఐడీ విచారణకు ఆదేశించి 15 మందిని అరెస్టు చేసి కటకటాల్లోకి కూడా పంపించడం జరిగింది. ఈ ముఠా మొత్తం 50 ఆసుపత్రులలో 112 నకిలీ బిల్లులతో దాదాపు 74 లక్షల రూపాయలు గోల్ మాల్ చేసింది…