వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ కి 96-104 స్థానాల్లో విజయం సాధిస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఈ రోజు తెలంగాణ భవన్లో జరిగిన తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభాపక్ష సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో వ్యవహరించాల్సిన తీరుపై పార్టీ శాసనసభ్యులకు దిశా నిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. పార్టీలో వర్గ రాజకీయాలను ప్రోత్సహించేంది లేదని స్పష్టం చేశారు. అసెంబ్లీలో పార్టీ విప్లు సమన్వయంతో వ్యవహరించాలని సూచించారు. ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఎమ్మెల్సీలు కలగజేసుకోవద్దని ఆదేశించారు. బాజిరెడ్డిపై పెట్టిన కేసులను ఎమ్మెల్సీ భూపతిరెడ్డి వెనక్కి తీసుకోవాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో 99శాతం మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మళ్లీ టిక్కెట్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. అసెంబ్లీ సీట్లు పెరిగే అవకాశం ఉందని, గుజరాత్ ఎన్నికల తర్వాత దీనిపై స్పష్టత వస్తుందన్నారు.