శ్రీలంక క్రికెట్ టీమ్ కెప్టెన్ దినేష్ చండీమాల్ చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచ క్రికెట్లో పెద్ద దుమారమే రేపుతోంది. ఓ మంత్రగత్తె సాయం తీసుకోవడం వల్లే అక్టోబర్ నెలలో పాకిస్థాన్ మీద రెండు టెస్టుల సిరీస్లో గెలిచామని చండీమాల్ వ్యాఖ్యానించడం పెనుదుమారాన్ని రేపుతున్నాయి. అసలు విషయం ఏంటంటే.. టెస్ట్ సిరీస్ ను శ్రీలంక 2-0 తేడాతో కైవశం చేసుకుంది. ఇక వన్డే, టీ20 సిరిస్లను మాత్రం పాకిస్థాన్ క్లీవ్ స్వీప్ చేసింది.
దీంతో ఈ పర్యటన ముగించుకుని శ్రీలంక జట్టు మంగళవారం స్వదేశానికి చేరుకుంది. ఈ సందర్భంగా కెప్టెన్ చండీమాల్ మీడియాతో జరిపిన చిట్ చాట్లో సంచలన విషయాలు వెల్లడించాడు. నేను ఎప్పుడైనా ఎవరి దగ్గరైనా ఆశీస్సులు తీసుకోవడానికి సిద్ధంగా ఉంటాం. మనకు టాలెంట్ ఒక్కటే సరిపోదు. కాస్త అదృష్టం కూడా కలిసిరావాలని నేను నమ్ముతాను. ఆ అదృష్టం మనకు ఎప్పుడు, ఎక్కడ, ఎలా దొరుకుతుందో చెప్పలేం. అందుకే మతగురువులు, మంత్రగాళ్లు అనే తేడా లేకుండా అందరి దగ్గరా నేను ఆశీర్వాదాలు తీసుకుంటాను.
పాక్తో సిరీస్ ఆడటానికి వెళ్లేముందు మంత్రగత్తె అయిన తన స్నేహితుడి తల్లిని తాను కలిశా. శ్రీలంక చేతిలో పాకిస్థాన్ ఓడిపోయేలా చేతబడి చేస్తానని ఆమె మాటిచ్చారు. ఆ తల్లి ఆశీర్వాదబలం, పూజల వల్లే మేం సిరీస్ గెలిచామని చండిమాల్ అన్నాడు. చండీమాల్ వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. క్రికెట్కు మంత్రాలతో ఎలా ముడిపెడతారని అతడిని నెటిజన్లు నిలదీశారు. ఒకవేళ మంత్రాలతో మ్యాచ్లు గెలవగలిగితే.. టెస్ట్ సిరీస్ నెగ్గిన శ్రీలంక జట్టు, ఆ తర్వాత జరిగిన వన్డే, టీ20 మ్యాచ్ల్లో దారుణంగా ఎందుకు ఓడిపోయిందని చండిమాల్ను ఎదురు ప్రశ్నించారు.