ఏపీ రాష్ట్ర అధికార పార్టీ టీడీపీకి చెందిన నేతల్లో అప్పుడే ఆ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతల పనితీరుపై నిర్వహిస్తున్న సర్వే గుబులు మొదలయ్యింది. ఈ క్రమంలో కర్నూలు అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే టికెట్ తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరికిస్తే బాగుంటుందో అభిప్రాయం తెలపాలని ఐవీఆర్ఎస్ (ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్) ద్వారా నియోజక వర్గానికి చెందిన ఓటర్ల నుంచి తెలుసుకుంటుండడం చర్చనీయాంశమైంది.
అందులో భాగంగా గత రెండు రోజులుగా వరసగా గురు, శుక్రవారాల్లో కర్నూలు అసెంబ్లీ నియోజక వర్గాలోని ప్రధానమైన కర్నూలు నగరంలోని ఓటర్లకు తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్లోని 9140–38119985 నంబరు నుంచి ఫోన్లు వచ్చాయి. అందులో భాగంగా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎమ్మెల్యే టికెట్ టీజీ భరత్కు ఇవ్వాలనుకుంటే ఒకటినొక్కండి… లేదా ఎస్వీ మోహన్ రెడ్డికి అయితే రెండు నొక్కండంటూ ఫోన్లు రావడం గమనార్హం. అయితే సమయం, సందర్భం లేకుండా ఈ సర్వే చేపట్టడం చర్చనీయాంశమైంది.
కర్నూలు ఎమ్మెల్యే సీటు విషయంలో అధికార పార్టీలో అప్పుడే గొడవ మొదలయ్యింది. సీటు నాదంటే నాదే అంటూ అటు ఎస్వీ మోహన్ రెడ్డి, ఇటు టీజీ భరత్ చెప్పుకుంటున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా తనకే వస్తుందని ఎస్వీ మోహన్రెడ్డి.. తాను లోకల్ కావున అవకాశం దక్కుతుందని భరత్ అంటున్నారు. అంతేకాకుండా సర్వేలో ఎవరు గెలుస్తారని తేలితే వారికే టికెట్ దక్కుతుందని భరత్ ముక్తాయించారు. మరోవైపు ఎస్వీ మోహన్రెడ్డి తాను మాత్రం టీడీపీ నుంచే పోటీ చేస్తానని, భరత్ ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారో తనకు తెలియదని పేర్కొనడంతో చర్చ మరింత ఆసక్తికరంగా మారింది. ఇదే నేపథ్యంలో తాజాగా సర్వే జరగడంతో మరోసారి సీటు విషయం చర్చనీయాంశమయ్యింది.అయితే వచ్చే ఎన్నికల్లో సీటు ఇవ్వడం ఇష్టంలేకే బాబు ఇలా పొమ్మనలేక పోగబెడుతున్నారు అని ఎస్వీ అనుచరులు అంటున్నారు .