తెలంగాణలో జరుగుతున్న శాసనసభ సమావేశాల్లో ఈ రోజు రాష్ట్రంలో ఉపాధ్యాయుల పోస్టుల భర్తీపై చర్చ జరిగింది .ఈ చర్చలో భాగంగా ప్రతిపక్ష పార్టీలకు చెందిన సభ్యులు రాష్ట్రంలో మొత్తం నలబై నుండి యాబై వేల వరకు పోస్టులు ఖాళీగా ఉన్నాయి అని చెప్పారు .దీనికి సమాధానంగా రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి ,డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సమాధానమిచ్చారు .
సభలో ఉపాధ్యాయుల పోస్టుల భర్తీపై ఎమ్మెల్యేలు గ్యాదరి కిషోర్, వంశీచందర్ రెడ్డి, ఆర్.కృష్ణయ్య, అక్బరుద్దీన్, కిషన్ రెడ్డి ,శ్రీనివాస గౌడ్, సున్నం రాజయ్యలు అడిగిన పలు ప్రశ్నలకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సమాధానం ఇచ్చారు.ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ “సభలో సభ్యులు చెప్పినట్లు రాష్ట్రంలో 50వేలు, 40వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా లేవన్నారు.
పత్రికల్లో రావడానికో, బయట ఉన్నవారు వినడానికో మాట్లాడితే తాను ఏం చేసేది లేదని ఆయన ప్రతిపక్ష సభ్యులను ఎద్దేవా చేశారు. వాస్తవానికి రాష్ట్రంలో 1,22,955 ఉపాధ్యాయ పోస్టులు ఉండగా, 1, 09,256 పోస్టుల్లో ఉపాధ్యాయులు పనిచేస్తున్నారన్నారు. 13,699 పోస్టులు మాత్రమే ఖాళీగా ఉన్నాయని, వీటిని భర్తీ చేసేందుకు 8792 పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చామని అన్నారు .అయితే 8792 పోస్టులను డైరెక్టుగా నియామకం చేయడం వల్ల 13,699 పోస్టుల్లో మిగిలినవి పదోన్నతుల ద్వారా భర్తీ అవుతాయన్నారు.