తెలంగాణ రాష్ట్ర శాసనసభా సమావేశాల్లో ఈ రోజు మైనార్టీల సంక్షేమంపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. ‘నాకు ఆత్మవిశ్వాసం ఎక్కువ. శాసనసభలో హామీ ఇస్తున్నా.. కచ్చితంగా వందశాతం ముస్లింలు, గిరిజనులకు రిజర్వేషన్లు సాధించి తీరుతాం. సమైక్య పాలకులు మైనార్టీల విషయంలో కొంత నిర్లక్ష్యం వహించారు.
ఎవరినీ నిందించి కూడా లాభంలేదు. అంతే కాకుండా దళిత క్రైస్తవుల అంశంపై పార్లమెంట్లో మా సభ్యులు పోరాటం చేస్తున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. దళిత క్రైస్తవులకు తప్పకుండా న్యాయం చేస్తామన్నారు. ‘మైనార్టీ ఉపప్రణాళిక ప్రతిపాదన తెస్తున్నారు. మైనార్టీ ఉప ప్రణాళిక అంశంపై ఎవరికీ అభ్యంతరం ఉండదు.
దేశంలో రాజ్యాంగం అనేది అన్ని రాష్ట్రాలకు ఒకేలా ఉంటుంది. ఉద్యమాలు మాకు కొత్త కాదు ముస్లింల రిజర్వేషన్ల కోసం మా పోరాటం కొనసాగుతుంది’అని స్పష్టం చేశారు. అవసరమైన సందర్భంలో అన్ని పార్టీలను కలుపుకొని దిల్లీకి తీసుకుపోతామని ఆయన చెప్పారు. ఉర్దూను అధికారికంగా రెండో భాషగా అమలు చేస్తామని సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా ప్రకటించారు.