తెలంగాణ రైతాంగానికి భవిష్యత్ బంగారుమయం చేయబోతున్నామని, రైతుల సహాయంతో కొత్త చరిత్ర సృష్టించబోతున్నామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు తెలిపారు. శాసనసభలో రైతు సమన్వయ సమితులు, రైతులకు పెట్టుబడిపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు. రాష్ట్రంలో 2018, జనవరి 1 నుంచి కొత్త చరిత్ర సృష్టించబోతున్నామని ఉద్ఘాటించారు. రైతులతో సహా ప్రతి ఒక్కరికి 24 గంటల కరెంట్ సరఫరా చేస్తామని సీఎం ప్రకటించారు. 24 గంటల విద్యుత్తో పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని సీఎం కేసీఆర్ అన్నారు.
రైతు సమన్వయ సమితుల ఏర్పాటుపై తప్పడు వ్యాఖ్యలు సరికాదని సీఎం స్పష్టం చేశారు. ఈ సమితులు అవసరం లేదని అంటున్న విపక్ష నేతలు సండ్ర వెంకట వీరయ్య, చిన్నారెడ్డి ఒక్క విషయాన్ని గమనించాలని సీఎం సూచించారు. రైతులు వ్యాపారుల చేతుల్లో మోసపోవద్దనే తాము సమన్వయ సమితిలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మార్కెట్ కమిటీలు, కో ఆపరేటివ్స్ సొసైటీలు ఉండగా…రైతు సమన్వయ సమితులు ఎందుకని వెంకట వీరయ్య ప్రశ్నిస్తుండటం సరికాదన్నారు. “టీడీపీ ప్రభుత్వం రైతు మిత్ర బృందాలు ఏర్పాటు చేసి 2 లక్షల రైతు మిత్ర బృందాలకు రూ. 350 కోట్లు ఖర్చు పెట్టింది. ఈ ఖర్చు ఎందుకు చేశారు? వాటితో ఏం సాధించారు?“ అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు.
ఇక 2005లో 50 వేల మంది ఆదర్శ రైతులను ఆనాటి సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి నియమించిన విషయాన్ని గుర్తు చేశారు. రూ. 60 కోట్లు ఖర్చు చేసి.. ఆదర్శ రైతులుగా ఆటో డ్రైవర్లు, మెకానిక్లను నియమించారని సీఎం తెలిపారు. అయితే తాము ఏ పథకం తీసుకున్న వందశాతం పారదర్శకంగా అమలు చేస్తున్నామని, వివక్ష లేని ప్రభుత్వం తమది అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.