కృష్ణానదిలో పడవ ప్రమాదంలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ బంధువులు ముగ్గురు చనిపోయిన వార్త తెలిసిందే . ఈ క్రమంలోఏపీ పర్యాటక శాఖ మంత్రి అఖిలప్రియ ఫోన్ చేసి సమాచారమందించారు. విజయవాడ బందరు రోడ్డులో ఉంటున్న ప్రభుకిరణ్.. నారాయణ బావమరిది పోవూరి లక్ష్మీ బాపారావు కుమారుడు. బాపారావు సోదరి వసుమతీదేవి నారాయణ భార్య. ప్రభు గుంటూరు జిల్లా మంగళగిరి ఎన్ఆర్ఐ కళాశాలలో ప్రొఫెసర్. ఈయనకు భార్య హరిత (30), కుమార్తె హస్విక (7) ఉన్నారు. వీరి స్వస్థలం నెల్లూరు జిల్లా కురుగొండ్ల.గత కొద్దిరోజుల క్రితమే హరిత నెల్లూరులో ఉంటున్న తల్లి విజయమ్మకు ఫోన్చేసి విజయవాడకు పిలిపించింది. ఆమెతో పాటు ప్రభు తల్లి లలితాదేవి (56), బంధువులు బొల్లినేని కుమారి, కుడితపూడి సుగుణమ్మ, ఈశ్వరమ్మ, దారపనేని విజయశ్రీ కూడా వచ్చారు.
ఆదివారం కావడంతో హరిత కుమార్తె హస్విక బయటకు వెళ్దామని మారాం చేసింది. హరిత వాళ్లందరినీ తీసుకుని పవిత్రసంగమం వద్దకు వెళ్లి.. బోటెక్కారు. ప్రమాదంలో అంతా నదిలో మునిగిపోయారు. విజయమ్మతోపాటు కొందరు ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు. లలితాదేవి, హరిత, హస్విక గల్లంతయ్యారు. లలితాదేవి, హరిత మృతదేహాలను సహాయ బృందాలు కనిపెట్టి బయటకు తీసుకొచ్చాయి.హస్విక ఆచూకీ తెలిసేదాకా వారిద్దరి మృతదేహాలను తీసుకెళ్లేది లేదని బంధువులు భీష్మించారు. దీంతో అఖిలప్రియ నారాయణకు ఫోన్ చేశారు.ప్లీజ్.. మీ వాళ్లకు నచ్చజెప్పండి
సిబ్బంది గాలిస్తున్నారు ,పాప మృతదేహం దొరికిన వెంటనే తాను స్వయంగా ఇంటి వద్దకు చేరుస్తానని ఆయనకు తెలిపారు. దీంతో నారాయణ బంధువులకు నచ్చజెప్పి.. లలితాదేవి, హరిత మృతదేహాలను గూడూరుకు తరలించేలా సహకరించారు.