ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర తొలివారం సక్సెస్ ఫుల్గా కంప్లీట్ చేసుకొని ఎనిమిదవరోజుకు చేరుకుంది. ఇక జగన్ పాదయాత్ర మొత్తం.. సభలు, సమావేశాలు, వివిధ సామాజిక వర్గాల నేతలతో భేటీలతో ముందుకు సాగుతోంది. ముఖ్యంగా చంద్రబాబు పాలనపై వైసీపీ అధినేత తీవ్రంగా ధ్వజమెత్తుతున్నారు. రెండు రోజుల పాటు వైసీపీ నేతలు నిర్వహించిన రచ్చబండ కార్యక్రమం సక్సెస్ అయిందని వైసీపీ వర్గీయులు చెబుతున్నారు. శని, ఆదివారాల్లో వైసీపీ అధినేత జగన్ ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గంలోనూ రచ్చ బండ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో రాత్రి బస చేశారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన వచ్చినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
ఇక జగన్ పాదయాత్రకి జనం వేలల్లో తరలి వస్తున్నారు. జగన్ ఒకవైపు పాదయాత్ర చేస్తూనే మరోవైపు ప్రసంగిస్తున్నారు. ఇక వారం రోజుల పూర్తి చేసుకున్న పాదయాత్రలో అనేక సమస్యలు జగన్ దృష్టికి వచ్చాయి. ముఖ్యంగా ప్రజలు స్పందిస్తున్న తీరు చూస్తుంటే.. చంద్రబాబు సర్కార్ ఎంతలా విఫలం అయ్యిందో అని కళ్ళకు కట్టినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో తన దృష్టికి వచ్చిన సమస్యలన్నింటినీ మేనిఫేస్టోలో పెడతామని జగన్ చెప్పారు. ఏపీలో అతి త్వరలోనే వైసీపీ అధికారంలోకి వస్తుందని, దీనికి ప్రజల ఆశీస్సులు ఉండాలని.. అధికారంలోకి వస్తే.. అన్ని సమస్యలు తీరుస్తానని చెప్పారు. అదేసమయంలో అన్ని సామాజిక వర్గాలకూ న్యాయం చేస్తానని చెప్పారు. ఈ క్రమంలోనే పలు పథకాలను కూడా ఆయన అనౌన్స్ చేశారు.