ప్రస్తుత ప్రజాస్వామ్యంలో చట్టాన్ని ఎవరు పడితే వాళ్ళు తమ చేతుల్లోకి తీసుకోవడం చాలా కామన్ అయిపోయింది. ఇక రాజకీయ నాయకులు అయితే వారు చెప్పిందే వేధం.. వారు చేసిందే చట్టం అనేలా తయారైంది. అయితే తాజాగా చట్టం ఎవరికీ చుట్టం కాదని నిరూపించి తన తడాఖా చూపించింది ఆ మహిళా కలెక్టర్. ఆఖరికి ఆమె నిజాయితీ, ధైర్య సాహసాలకు ప్రతిబింభంగా ఆమెతో తలపడిన రాజకీయ ఉద్దండుడు మంత్రి పదవి కూడా పోగొట్టుకుని ఇప్పుడు లబోదిబో అంటున్నాడు.
అందమైన సరస్సును పూడ్చి విలాసవంతమైన రిసార్ట్ కట్టుకున్న మంత్రికి పదవి పోయేలా చేసిన ధీరత్వం ఆమె సొంతం. అధికారపార్టీకి వంగి వంగి దండాలు పెడుతూ.. విధేయతతో వ్యవహరించే తీరుకు భిన్నంగా ఉండే ఆమె ఇప్పుడా రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారారు. కేరళకు చెందిన మహిళా కలెక్టర్ టీవీ అనుపమ.
అలప్పుఝూ జిల్లా కలెక్టర్గా అనుపమ పని చేస్తున్నారు. అక్కడున్న అందమైన సరస్సును పూడ్చేసి అక్రమంగా ఒక ప్యాలెస్ ను కట్టుకున్నారు మంత్రి థామస్. ఆయన చేసిన పనిని తీవ్రంగా తప్పు పటట్టమే కాదు.. మంత్రిపై యుద్ధమే ప్రకటించింది. కలెక్టర్ పవర్ అంటే ఏంటో ఆమె చూపించింది. మరి కాకలు తీరిన ఆ రాజకీయ నాయకుడు ఊరికే ఉంటాడా.. ఆమెకు వార్నింగ్లు కూడా ఇచ్చారు. అయినా ఆమె అదర్లేదు, బెదర్లేదు.
మంత్రిగారి హెచ్చరికల్ని పట్టించుకోకుండా న్యాయం కోసం పోరాడింది. సరస్సును పూడ్చేసి అక్రమంగా కట్టిన ప్యాలెస్ గుట్టును రట్టు చేసింది. రెవెన్యూ శాఖ నుంచి పూర్తి నివేదికలు తెప్పించుకున్న ఆమె అందులో జరిగిన కుట్ర గురించి రెవెన్యూ కార్యదర్శకి తుది నివేదికను సమర్పించింది. ఈ సందర్భంగా ఆమెపై తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు వచ్చాయి. అయినా అస్సలు వెనక్కి తగ్గలేదు. ఆమె పోరాటానికి స్థానిక మీడియా తోడైంది.
అయితే ఆ మంత్రి కోర్టుకెళ్లారు. అక్కడ ఆయనకు ఎదురుదెబ్బ తప్పలేదు. దీంతో.. ఆయన రాజీనామా చేయక తప్పలేదు. దీంతో.. ఆయన కబ్జా కట్టడాన్ని కూల్చేసేపనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇవాల్టి రోజున అధికారంలో ఉన్న వారికి అండదండలు పూర్తిగా ఉండటం.. ప్రభుత్వాలు అండగా ఉండటం మామూలే. ఇందుకు భిన్నంగా ఒక మహిళా ఐఏఎస్ అధికారిణి సాగించిన న్యాయపోరాటానికి మంత్రి పదవి పోగొట్టుకోవటంతో దేశ రాజకీయాల్లోనే హాట్ టాపిక్గా మారింది.