తెలంగాణ రాష్ట్రంలో దేవర కద్ర నియోజక వర్గంలో పేదల సొంతింటి కల తీరింది. లక్షలు అప్పు చేసి ఇల్లు కట్టుకునే తాహతు లేక ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ ఇంతకాలం జీవనం సాగించిన పేదల బతుకులు మారాయి. తెలంగాణ సర్కారు పుణ్యమాని పేదల కల నెరవేరింది. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి దత్తత గ్రామం నిజలాపూర్ లో పండగ వాతావరణం కనిపించింది.
శుభ గడియలో డబుల్ బెడ్ రూం ఇళ్లల్లోకి జనం గృహ ప్రవేశం చేశారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోనే తొలి సారిగా పూర్తయిన డబుల్ బెడ్ రూం ఇళ్ల లబ్దిదారుల కళ్లల్లో ఆనందం వెల్లివిరిసింది. కొత్త ఇళ్లలను చూస్తూ మురిసిపోయారు. చుట్టలను పిలిపించుకుని సహపంక్తి భోజనం చేశారు. కొత్త ఇంటిలోకి అడుగుపెట్టిన క్షణాల్లో నిజలాపూర్ మహిళలు, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు.
ఆనందభాష్పాలు రాల్చారు. నిజలాపూర్ మహిళలను తోబుట్టువుల్లా భావిస్తూ మిఠాయిలు తినిపించారు. మహిళలు పాదాభివందనం చేశారు. కొన్ని నిమిషాల పాటు సాగిన అనూహ్య పరిణామం నిజలాపూర్ వాసులను కట్టిపడేసింది.