అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనయ ఇవాంకా ట్రంప్ హైదరాబాద్ పర్యటనకు వచ్చే షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 27న అర్ధరాత్రి 1.45 గంటలకు 180 మంది అమెరికా పారిశ్రామికవేత్తలు, ప్రతినిధులతో కలిసి ప్రత్యేక విమానంలో ఆమె హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారని సమాచారం. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో మాదాపూర్ లోని వెస్టిన్ హోటల్కు వెళ్లనున్న ఇవాంకా అక్కడే బస చేస్తారు.
ఇవాంక బస కోసం వెస్టిన్ హోటల్లో స్పెషల్ ప్రెసిడెన్షియల్ సూట్ను అధికారులు సిద్ధం చేశారు. నాలుగు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండే ఆ సూట్ను పరిశీలించిన అమెరికన్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఆ సూట్కు అన్నివైపులా ఉన్న అద్దాలకు అదనంగా బుల్లెట్ ప్రూఫ్ అద్దాలను ఏర్పాటు చేశారు.
ఈ స్పెషల్ ప్రెసిడెన్షియల్ సూట్లో సాధారణ సమయంలో ఎవరైనా బస చేయాలంటే రోజుకు లక్షన్నర నుండి రెండు లక్షల వరకు అద్దె చెల్లించాల్సి ఉంటుంది. ఇక వెస్టిన్ హోటల్ పైభాగంతో పాటు చుట్టుపక్కల ఉన్న భవనాలపై అమెరికన్ సాయుధ సిబ్బంది ప్రత్యేక ఆయుధాలతో కాపలా కాస్తారు. హోటల్ కింది భాగంలో ఇవాంక వాహనాలను ఆపడం కోసం ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు.ఇంవాకతో పాటు వస్తున్న అమెరికన్ డెలిగేట్లకు శంషాబాద్లోని నోవాటెల్, రాడిసన్ తదితర హోటళ్లలో బస ఏర్పాటు చేశారు. వారంతా 28న మధ్యాహ్నం 12 గంటల సమయంలో పారిశ్రామికవేత్తల సదస్సు జరిగే హెచ్ఐసీసీ ప్రాంగణానికి చేరుకుంటారు.