ఏపీ రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు వైెఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర టీడీపీ నేతలపై తీవ్ర ప్రభావాన్నే చూపుతోంది. ప్రస్తుతం జగన్ పాదయాత్ర కర్నూలు జిల్లాలో జరుగుతున్న నేపథ్యంలో… కర్నూలు జిల్లాలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. మరీ ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కుటుంబంపై జగన్ పాదయాత్ర ఎఫెక్ట్ ఎక్కువనే చెప్పాలి.
అయితే, ఇటీవల జగన్ పాదయాత్రలో భాగంగా పత్తికొండ నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున దివంగత నేత చెరుకులపాడు నారాయణ రెడ్డి భార్య శ్రీదేవిని బరిలోకి దించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. జగన్ తీసుకున్న నిర్ణయంతో కేఈ కుటుంబం కాస్త కలవర పడుతుండటంతో పాటు.. కర్నూలు జిల్లా వైసీపీ కార్యకర్తల్లో నూతనోత్సాహానికి నాంది పలికింది.
కేఈ కుటుంబాలకు రాజకీయ సన్యాసం తప్పదా…?
ఏపీ ప్రతిపక్షనేత వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా కర్నూల్ జిల్లా కృష్ణగిరిలో నిర్వహించిన సభలో ప్రసంగించారు. ఈ మేరకు పత్తికొండ నుంచి వైసీపీ తరపున దివంగత నేత చెరుకులపాడు నారాయణ రెడ్డి భార్య శ్రీదేవిని బరిలోకి దించనున్నట్లు ప్రకటించారు. శ్రీదేవిని మెజారిటీలో గెలిపించాలని జగన్ ప్రజలను కోరారు. జగన్ తీసుకున్న నిర్ణయంతో కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్నిచ్చింది.
అయితే, మంత్రి కేఈ కృష్ణమూర్తి, ఆయన సోదరుడు ప్రభాకర్లకు కంచుకోటగా ఉన్న నియోజకవర్గంపై వైసీపీ జెండా ఎగరేయాలనే లక్ష్యంతోనే జగన్.. ముందుగానే తమ పార్టీ అభ్యర్థిగా శ్రీదేవిని ప్రకటించారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
గత ఎన్నికల్లో శ్రీదేవి భర్త చెరుకులపాడు నారాయణరెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీ చేసి స్వల్ప ఓట్లతో ఓటమిపాలయిన విషయం విధితమే. ఆ తర్వాత ఆయన వైసీపీలో చేరారు. కానీ, ఏడాది క్రితం ఆయన్ను ప్రత్యర్థులు దారుణంగా హత్య చేశారు. ఈ నేపథ్యంలోనే నారాయణ కుటుంబంలో ధైర్యం నింపేందుకు వైఎస్ జగన్ శ్రీదేవిని పత్తికొండ నియోజకవర్గం వైసీపీ పార్టీ అభ్యర్థిగా ప్రకటించారని తెలుస్తోంది. మరో పక్క కేఈ ఫ్యామిలీకి మరో కంచుకోట డోన్ నియోజకవర్గం అని తెలిసిందే. అయితే 2014 ఎన్నికల్లో డోన్ నియోజకవర్గంలో వైసీపీ నేత, ప్రస్తుత డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి టీడీపీ కంచుకోటను బద్దలు కొట్టాడు.
ఇప్పటికే బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి తనదైన పాలనతో.. ఎల్లప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ.. సమస్యలను పరిష్కరిస్తూ ప్రభుత్వం చేస్తున్న తప్పులను లెక్కలతో సహా బట్టబయలు చేస్తూ చంద్రబాబు సర్కార్కు చుక్కలు చూపిస్తూ ప్రజల్లో మంచి పేరును సంపాదించుకున్నాడు. అందులోనూ వైఎస్ జగన్కు మంచి మిత్రుడు కూడాను. కనుక మళ్లీ ఆయనే డోన్ నియోజకవర్గంలో వైసీపీ తరుపున ఎమ్మెల్యేగా విజయ ఢంకా మోగించనున్నారు.
మరోపక్క..
వచ్చే ఎన్నికల్లో పత్తికొండ టిక్కెట్ కోసం ఎదురు చూస్తున్న కేఈ ఫ్యామిలీకి ఎదురుదెబ్బ తగిలేలా ఉంది. దీనికి కారణం పత్తికొండ నియోజకవర్గంలో కేఈ కృష్ణమూర్తి కుటుంబం చేస్తున్న ఆగడాలు వెలుగులోకి రావడమే. దీంతో ప్రస్తుత ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, ఆయన కుమారుడు కేఈ శ్యాంబాబుకు వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేందుకు చంద్రబాబు విముఖత చూపుతున్నట్లు సమాచారం.
అదే విధంగా డోన్ ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తోన్న కేఈ కృష్ణమూర్తి సోదరులు కేఈ ప్రతాప్, కేఈ ప్రభాకర్లకు చంద్రబాబు టిక్కెట్ ఇచ్చినా… ఇప్పటికే అక్కడ బుగ్గన రాజారెడ్డి ఎమ్మెల్యేగా ఉండటం.. అందులోను ప్రజల్లో మంచి నేతగా పేరు సంపాదించుకోవడంతో టీడీపీ కంచుకోటను వైసీపీ కంచుకోటగా మార్చారు. కనుక కేఈ కుటుంబానికి గెలిచే అవకాశం లేదు. కనుక కేఈ కుటుంబంలో ఇద్దరికి టికెట్ ఇచ్చే అవకాశం లేదు. మరో ఇద్దరికి టికెట్ ఇచ్చినా గెలిచే అవకాశం లేదు. అందుకే కేఈ కుటుంబానికి రాజకీయ సన్యాసం తప్పదా..? అని సీనియర్ రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.