ఏపీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ నుండి అధికార టీడీపీ పార్టీలోకి వలసలను ప్రోత్సహిస్తున్నారు టీడీపీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు . సోమవారం వైజాగ్ జిల్లాలో పాడేరు అసెంబ్లీ నియోజక వర్గ వైసీపీ మహిళ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరీ రాష్ట్ర రాజధాని అమరావతిలో చంద్రబాబు సమక్షంలో టీడీపీలి చేరారు. అయితే ఒకవైపు వైసీపీ పార్టీని వీడుతూ కూడా.. ఆ పార్టీ గురించి సానుకూలంగా మాట్లాడారు గిడ్డి ఈశ్వరి. వైసీపీ పార్టీని వీడి టీడీపీ పార్టీలో చేరిన కొందరు ఎమ్మెల్యేలు.. ఆ పార్టీ అధినేత జగన్ పై విమర్శలు చేస్తూ వెళ్లారు. కొందరు డెవలప్ మెంట్ కోసం చేరుతున్నామని అన్నారు. గిడ్డి ఈశ్వరి కూడా డెవలప్ మెంట్ నినాదాన్ని చేశారు.. అయితే ఫిరాయింపుకు ముందు ఈమె మీడియాతో మాట్లాడుతూ.. పాడేరు, అరకు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ బలంగా ఉందని వ్యాఖ్యానించారు.
గత మూడేళ్లలో పార్టీ చాలా బలోపేతం అయ్యిందని ఆమె అన్నారు. అలాగే వైసీపీ అధినేత జగన్ మీద కూడా చాలా సానుకూల వ్యాఖ్యలే చేశారీమె. ‘జగనన్న..’అంటూ సంబోధించడం కూడా గమనార్హం. ‘జగనన్న అంటే నాకు ప్రాణం… నాకు రాజకీయ భిక్ష పెట్టింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డే. ఉపాధ్యాయురాలిగా ఉన్న నన్ను ఎమ్మెల్యేగా చేశారని టీడీపీలోకి చేరిన ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో గిరిజనులకు ఎంతో మేలు జరిగింది. గత మూడేళ్లలో అరకు, పాడేరు నియోజకవర్గాల్లో వైసీపీ ఎంతో బలపడింది. టీడీపీ గెలవడం కూడా కష్టమే. అయితే నేను టీడీపీలో చేరి పార్టీని గెలిపించుకోవడానికి ప్రయత్నిస్తాను. వైసీపీలో కొంతమంది నేతలు గత కొన్నాళ్లుగా నాకు ప్రాధాన్యతను తగ్గిస్తూ వచ్చారు..’ అని ఈశ్వరి అన్నారు.