తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మరింత జోరు పెంచుతున్నారు. ఇప్పటివరకు అంతర్గత కార్యకలాపాలతో బిజీగా ఉంటూ జనానికి ఆశించిన మేరకు చేరువ కాలేకపోతున్న అధికార టీఆర్ఎస్ పార్టీ ఇక వారి చెంతకు చేరే ప్రయత్నాలు మొదలు పెట్టబోతుంది. భారీ ఎత్తున అభివృద్ధి, సంక్షే మ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో క్రెడిట్ దక్కడం లేదనే భావన కొందరు నేతల్లో ఉన్న క్రమంలో…గులాబీ దళపతి కొందరు సీనియర్ నేతలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు సమాచారం.
కొంతమంది ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు సామాన్య కార్యకర్తలను నిర్లక్షం చేస్తుండడం, పార్టీలో కొంత అసంతృప్తికి కారణమయిందని గులాబీ దళపతికి రిపోర్ట్ చేరిందని. దీంతో క్రమంగా ఎన్నికలు సమీపించబోతుండడంతో అప్రమత్తం కాకపోతే కష్టమని భావించిన సీఎం కేసీఆర్ ఇక పార్టీ కార్యకలాపాలను విస్తృ తం చేయాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు. పార్టీ కోసం క్రియాశీలంగా కష్టపడే వారికి ప్రాధాన్యం ఇవ్వడం..మిగతా వారికి హెచ్చరించడం చేయనున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో పార్టీ పరమైన కార్యక్రమాలను గ్రామ గ్రామాన నిర్వహించి ప్రజలకు మరింత చేరువ కావాలన్నదే అధిష్టానం నిర్ణయంగా చెబుతున్నారు. ఓవైపు ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్థి, సంక్షేమ కార్యక్రమాలపై విస్తృతంగా ప్రచారం చేయడం, మరోవైపు పార్టీ కార్యక్రమాలను ముమ్మరంగా చేపట్టి జనంతో మమేకం కావాలని అధిష్టానం భావిస్తుంది. కొద్ది రోజుల్లోనే పార్టీకి సంబంధించిన ప్రచార కార్యక్రమాలపై షెడ్యూల్ను కూడా ఖరారు చేయాలని నిర్ణయించారు. కార్యకర్తల సమావేశాలు, ఇతర పార్టీ పరమైన కార్యక్రమాలను ఇక నిరంతరాయంగా చేపట్టి జనం చెంతకు చేరువ కావాలన్నదే ఆ పార్టీ నిర్ణయంగా చెబుతున్నారు.