వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పక్కా వ్యూహం ప్రకారం ముందుకు వెళుతున్నారు. ఏపీలో ఉన్న కోట్ల మంది ప్రజలకు సెంటిమెంట్గా ఉన్న ప్రత్యేక హోదాను తనకు అనుకూలంగా మార్చుకొని… గత కొన్నేళ్లుగా జగన్ పై టీడీపీ బ్యాచ్ చేస్తున్న కామెంట్స్కు చెక్ పెట్టడం ఖాయమనిపిస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయాక ఏపీకి ప్రత్యేక హోదా కోసం మొదటి నుండి ప్రతిపక్షమైన వైసీపీ ఏపీలో పోరాడుతూనే ఉందని అందరికీ తెలిసిన సంగతే. గతంలో ప్రత్యేక హోదా కోసం జగన్ ఆమరణ దీక్ష… యువభేరి కార్యక్రమాలతో యువతను చైతన్య పర్చే కార్యక్రమాలను ఏర్పాటు చేయాగా.. అధికార టీడీపీ మాత్రం ఎలాంటి సపోర్ట్ ఇవ్వకుండా నాటకాలు ఆడుతూ.. ఆటంకాలు సృష్టించింది. దీంతో కేంద్రం కూడా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని, ప్యాకేజీ ఇస్తామని ప్రకటించింది. దీనికి చంద్రబాబు సర్కార్ కూడా తలూపడంతో ఇక ప్రత్యేక హోదా రాదని ఏపీ మొత్తానికి అర్థమయిపోయింది.
అయితే జగన్ మాత్రం ప్రత్యేక హోదాని అంత ఈజీగా వదిలేలా లేడని తాజా పరిణామాలు చూస్తుంటే అర్ధమవుతోంది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళలో కేంధ్ర, రాష్ట్రా ప్రభుత్వాల పై ప్రత్యేక హోదా కోసం వత్తిడి తెచ్చేందుకు జగన్ కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగానే మార్చి ఒకటి నుంచి ఏప్రిల్ ఆరవ తేదీ వరకూ దశల వారీగా ఆందోళన చేపట్టాలని జగన్ నిర్ణయించారు. ఈ నేపధ్యంలో మొదటి దశ మార్చి ఒకటవ తేదీన అన్ని జిల్లాల్లో కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు చేస్తారు. తర్వాత దశలో మార్చి ఐదవ తేదీన వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు ఢిల్లీ నుంచి జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తారు. ఈ క్రమంలోనే మార్చి 5వ తేదీ నుంచి ఏప్రిల్ 6వ తేదీ వరకూ పార్లమెంటు సమావేశాలు జరుగుతాయి. ఈ నెల రోజులూ ఎంపీలు పార్లమెంటు లోపల, బయట ఆందోళన చేయనున్నారు. ఏప్రిల్ 6వ తేదీలోగా ప్రత్యేక హోదా పై కేంద్రం నుంచి ప్రకటన రాకుంటే వైసీపీ చివరి అస్త్రంగా తమ ఎంపీలు రాజీనామా చేస్తారని జగన్ ప్రకటించారు. దీంతో టీడీపీ బ్యాచ్ తరచూ వైసీపీ ఎంపీల చేత రాజీనామా ఎందుకు చేయించలేదని విమర్శస్తున్న నేపధ్యంలో జగన్ పక్కా ప్రణాళికతో ముందుగా మోదీ సర్కార్, టీడీపీ సర్కార్ పై ఒత్తిడి తెచ్చి ఆ తర్వాత రాజీనామా చేయించాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఇకనుండి ఎల్లో గ్యాంగ్ జగన్ వైపు వేలెత్తి చూపే ఛాన్స్ కూడా లేదని.. మొత్తం మీద జగన్ అనూహ్య దూకుడు ఒకవైపు టీడీపీ గ్యాంగ్ని ఇరకాటంలో నెట్టేసిందని.. మరోవైపు ఏపీ ప్రజల మనసులు కూడా గెలుచుకోవడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.