పెళ్లయిన కొద్ది గంటల్లోనే వధువు మృతిచెందిన విషాద ఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. పెళ్లి బాజాల చప్పుడు చెవిలో మార్మోగుతుండగానే ఓ నవ వధువు అకస్మాత్తుగా మృతి చెందింది. ఈ విషాద ఘటన రెండు కుటుంబాలను శోక సంద్రంలోకి నెట్టేసింది. సూర్యాపేటకు చెందిన కటకం గాయత్రి (22)కి మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురుకు చెందిన గుండా వేణుతో శనివారం రాత్రి ఘనంగా వివాహం జరిగింది.
ఆ తర్వాత బంధుమిత్రులతో కలిసి ఫంక్షన్ హాలు నుంచి వధువు ఇంటికి బయలుదేరారు. మార్గమధ్యంలో దేవాలయంలోకి వెళ్లి దేవుడికి నమస్కరించి బయటకు వస్తుండగా నవ వధువు గాయత్రి ఒక్కసారిగా కుప్పకూలింది. హతాశులైన కుటుంబ సభ్యులు, బంధువులు వెంటనే ఆమెను సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అక్కడ వైద్యుడు అందుబాటులో లేకపోవడంతో స్థానిక ప్రాంతీయ ఆసుపత్రికి తీసుకెళ్లారు. గాయత్రిని పరిశీలించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్టు ధ్రువీకరించారు. గాయత్రి తల్లిదండ్రులు హన్మయ్య, పుష్పలతను ఓదార్చడం ఎవరి తరం కాలేదు.