ఆంధ్ర ప్రదేశ్ విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేకహోదా కోసం మహోద్యమమే జరుగుతోంది. రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు . ప్రస్తుతం దీనిపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతంది. అయితే ప్రత్యేక హోదా ఉద్యమంపై సినిమా వాళ్లకు బాధ్యత లేదా? అని ప్రశ్నించిన టీడీపీ నేత రాజేంద్ర ప్రసాద్కు బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు కౌంటర్ ఇచ్చాడు. శుక్రవారం తన ట్విట్టర్ ఖాతాలో తాను జైల్లో ఉన్న ఫొటోను పోస్ట్ చేసి.. టాలీవుడ్ చిత్తశుద్ధిని సంకించవద్దని స్పష్టం చేశాడు. ప్రత్యేక హోదా పార్టీలకు అతీతంగా పోరాడేందుకు తాను ఎప్పుడూ సిద్ధమేనని వెల్లడించాడు.
ఈ సందర్భంగా గతేడాది విశాఖపట్నం పోలీసులు తనను అరెస్టు చేసిన విషయాన్ని సంపూ ప్రస్తావించాడు. ‘‘గత సంవత్సరం సోషల్ మీడియాలో యువత వైజాగ్లో మానవహారంగా ఏర్పడి స్పెషల్ స్టేటస్ కోసం పోరాడాలి అని పిలుపు ఇవ్వటం, అది ఉధృతమవటం జరిగింది. ట్విట్టర్ వేదికగా ఆనాడు నన్ను… నీకు బాధ్యత లేదా? నీ విజయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆదరణ లేదా అని ప్రశ్నించి, నా బాధ్యత గుర్తు చేశారు. మీరు తలపెట్టబోయే ఆ ఉద్యమానికి నేను వస్తాను అని మాట ఇచ్చాను’’ అని తెలిపాడు.
‘‘ఈ రోజు సినిమా వాళ్లకి బాధ్యత లేదా అని ప్రశ్నించిన గౌరవ రాజేంద్రప్రసాద్ గారికి నేను విన్నవించేంది ఏంటంటే.. ఆనాడు ఉద్యమానికి సంఘీభావంగా సాయి ధరమ్ తేజ్, సందీప్ కిషన్, నిఖిల్ ఇలా ఎందరో యువ హీరోలు మద్దతుగా ట్వీట్లు చేశారు’’ అని పేర్కొన్నాడు.
‘‘అంతర్జాతీయ సమ్మిట్ కారణంగా ఆ రోజు కాకుండా వేరొక రోజు మీ ఉద్యమాన్ని వాయిదా వేసుకోండని నాకు ఆలస్యంగా తెలిపారు. కానీ ఆ ఉద్యమానికి నాయకులంటూ లేరు. యువతే నాయకత్వం వహించింది. మాట ఇచ్చి, సమ్మిట్ కారణంగా నేను రావడం లేదని చెప్పటం అన్యాయమవుతుంది. వస్తే అరెస్ట్ చేస్తారని తెలిసినా అక్కడికి వెళ్లాను’’