సంక్షేమం, అభివృద్ధి జోడెద్దులుగా ముందుకు సాగుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలన అనేక రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తోంది. తాజాగా మరో రాష్ట్రం మన సర్కారు పథకానికి ఫిదా అయింది. తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం అమోఘమని కేరళ రాష్ట్ర మంత్రి మెర్సికుట్టి ప్రశంసించారు. మంగళవారం సచివాలయంలో ఆమె రాష్ట్ర పశుసంవర్థక, మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ను మర్యాదపూర్వకంగా కలిశారు.
తెలంగాణ ప్రభుత్వం మత్స్య రంగం అభివృద్ధి కోసం అమలు చేస్తున్న పథకాల గురించి మంత్రి తలసాని కేరళ మంత్రికి వివరించారు. మత్స్య రంగంపై సుమారు నాలుగు లక్షల మంది ఆధారపడి జీవిస్తున్నారని, దీనిని దృష్టిలో ఉంచుకొని వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఉచిత చేప పిల్లల పంపణీ పథకాన్ని తీసుకువచ్చిందని చెప్పారు. మత్స్యరంగంపై ఆధారపడి 3.70 లక్షల కుటుంబాలు ప్రత్యక్షంగా, 27 లక్షల మంది పరోక్షంగా ఉపాధి పొందుతున్నారని మంత్రి వివరించారు. రాష్ట్రంలో నాలుగు వేల మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల్లో 2,80,225 మంది సభ్యులుగా ఉన్నారని చెప్పారు.
2016-17లో 3,939 జలాశయాలు, చెరువుల్లో రూ. 22 కోట్ల విలువైన 27 కోట్ల చేపపిల్లలను వదిలామని, తద్వారా సుమారు రూ.500 కోట్ల ఆదాయం లభించిందని పేర్కొన్నారు. 2017-18లో 11,067 నీటి వనరుల్లో రూ.42 కోట్లతో 51 కోట్ల చేపపిల్లలను వదిలామని, రూ.1.38 లక్షలతో 11 జలాశయాల్లో మంచినీటి నీలకంఠ రొయ్య విత్తనాలను జలాశయాల్లో విడుదల చేశామని వివరించారు. ఈ ఏడాది ఫలితాలను పరిశీలించి వచ్చే సంవత్సరం 77 జలాశయాల్లో రొయ్య విత్తనాలు వదిలేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రూ.10 లక్షల వ్యయం చొప్పున మత్స్య సహకార సంఘాలకు 500 కమ్యూనిటీ హాళ్లు నిర్మించినట్టు మంత్రి తలసాని తెలిపారు. రూ.1000 కోట్లతో సమీకృత మత్స్య అభివృద్ధి పథకాన్ని 38 అంశాలతో రూపొందించామని చెప్పారు. వినియోగదారులకు పరిశుభ్రమైన వాతావరణంలో తాజా చేపలు అందించాలనే లక్ష్యంతో ఆధునిక చేపల మార్కెట్ల నిర్మాణాన్ని చేపట్టినట్లు కేరళ మంత్రికి తలసాని వివరించారు. మత్స్యకారులకు సబ్సిడీపై ద్విచక్ర వాహనాలు, ట్రాలీ ఆటోలను కూడా అందిస్తున్నట్టు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమం కోసం తీసుకుంటున్న నిర్ణయాలు అభినందనీయమని కేరళ మంత్రి ఈ సందర్భంగా ప్రశంసించారు.