దేశం యావత్తు ఆసక్తిగా ఎదురుచూస్తున్న పంటల పెట్టుబడి పథకం ‘రైతుబంధు’ ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. ఈ కార్యక్రమానికి కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మం డలంలోని శాలపల్లి- ఇందిరానగర్ ఇందుకోసం సర్వాంగ సుందరంగా ముస్తాబయింది. ఈ పథకం ద్వరా రైతుకి పెట్టుబడి కింద ఎకరాకి రూ.8వేలు ఇస్తున్నారు. దేశంలో మొదటిసారి ఈ పథకానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది
అయితే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 58 లక్షలు పాస్ పుస్తకాలు, చెక్కులు పంపిణీ చేయనుంది ప్రభుత్వం. ఉదయం 10 గంటలకు హుజురాబాద్ లో రైతుబంధు పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభిస్తారు.ఆ తర్వాత లక్ష మందితో ఏర్పాటు చేయనున్న భారీ బహిరంగ సభకు హాజరుకానున్నారు.
హుజూరాబాద్ లో సీఎం రైతుబంధు ప్రారంభించిన తర్వాత 11 గంటలకు అన్ని జిల్లాల్లో రైతులకు చెక్కులు పంపిణీ జరగనుంది.
రాష్ట్రంలోని 58.33 లక్షల మంది రైతులకు కోటి 43 లక్షల 27 వేల ఎకరాల సాగుభూమికి పంట సాయం ఇవ్వనుంది ప్రభుత్వం. ఇందుకోసం 5 వేల 730 కోట్ల విలువైన 58.98 లక్షల చెక్కులను అందించనుంది. ఇవాల్టి నుంచి ఈ నెల 17 వరకు రాష్ట్రవ్యాప్తంగా 10 వేల 833 గ్రామాల్లో పంపిణీ చేయనున్నారు. వారం రోజులు చెక్కులు, పట్టాదార్ పాస్ పుస్తకాలు పంపిణీ జరగనుంది. ఎండాకాలం కావడంతో ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు… తిరిగి సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆదేశించింది ప్రభుత్వం.