ఈ మద్య దేశ వ్యాప్తంగా బస్సు ప్రమాదాలు పెరుగుతున్నాయి. గత నెలలో హిమాచల్ ప్రదేశ్లో పాఠశాల నుంచి బయల్దేరిన బస్సు లోయలో పడిన ఘటనలో 27మంది విద్యార్థులు సహా 30మంది మృతి చెందగా, 35మంది తీవ్రంగా గాయపడ్డ సంగతి తెలసిందే. ఈ ఘటనలో మృతి చెందిన వారిలో దాదాపు పదేళ్లలోపు చిన్నారులే. తాజాగా అదే రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్లో ఘోర ప్రమాదం జరిగింది. సిర్మార్ జిల్లా సనోరా వద్ద ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు అదుపు తప్పి లోయలో పడింది.ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా.. మరో 12మంది తీవ్రంగా గాయపడ్డారు. మాన్వా నుంచి సోలార్ వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలో పడింది.
ఈ ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయ పడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. పోలీసులు, స్థానికులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసులు పేర్కొన్నారు.ఈ ఘటనపై సిర్మోర్ డిప్యూటీ కమిషనర్ లలిత్ జైన్ మాట్లాడుతూ…‘ మృతి చెందిన వారిలో చాలా మంది రాజ్గఢ్ ప్రాంతానికి చెందిన వారే. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నాం. దీనిపై వివరాలను త్వరలోనే ప్రకటిస్తాం. క్షతగాత్రులను సర్మోర్ ఆసుపత్రిలో చేర్చాం’ అని తెలిపారు.