యువ సామ్రాట్ నాగార్జున ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు రామ్గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న చిత్రంలోన, అలాగే, నేచురల్ స్టార్ నానితో కలిసి మరో మల్టీస్టార్ చిత్రంలో ను నటిస్తున్నారు. అయితే, రామ్గోపాల్ వర్మ చిత్రం అన్ని పనులను పూర్తి చేసుకుని జూన్లో రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది.
ఈ నేపథ్యంలో ఇటీవల ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగార్జున పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సంవత్సరం తాను మరిచిపోలేని వార్త ప్రఖ్యాత నటి శ్రీదేవి మరణ వార్తేనని, ఆ వార్తను ఎంత మరిచిపోదామనుకున్నా తనవల్ల కావటం లేదని నాగార్జున పేర్కొన్నారు. గోవిందా… గోవిందా, ఆఖరి పోరాటం చిత్రాల్లో శ్రీదేవితో నటించానంటూ నాగార్జున గుర్తు చేశారు.
శ్రీదేవి కేవలం ఒక్క తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి మాత్రమే కాదని, బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ ఇలా దేశంలోని అన్ని సినీ ఇండస్ట్రీలకు చెందిన నటిగా నాగార్జున అభివర్ణించారు. ఆమె ఒక లేడీ సూపర్ స్టార్ అని శ్రీదేవిపై తనకున్న అభిప్రాయాన్ని నాగార్జున తెలిపారు. శ్రీదేవి మరణించిందంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నానంటూ నాగార్జున చెప్పుకొచ్చారు.