ఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రజాసమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతోంది. 182వ రోజు పాదయాత్రను ఆయన బుధవారం తణుకు శివారు నుంచి ప్రారంభించారు. వర్షం నిరంతరాయంగా కురుస్తున్నా లెక్కచేయకుండా వైఎస్ జగన్ పాదయాత్రను కొనసాగిస్తున్నారు.
ప్రజలు సైతం వర్షంలో తడుస్తూనే జననేతను కలవడానికి భారీగా తరలి వస్తున్నారు. గ్రామాలను దాటడానికి గంటల కొద్ది సమయం పడుతుండటంతో వైఎస్ జగన్ భోజన విరామాన్ని తీసుకోకుండా పాదయాత్రను కొనసాగిస్తున్నారు. అయితే ఈ పాదయాత్ర ఉండ్రాజవరంలోకి ప్రవేశించగానే వైఎస్ జగన్ను అక్కడి ఆటో కార్మికులు కలిసి వారి సమస్యలను చెప్పుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఖాకీ చొక్కా ధరించి ఆటో నడిపారు. దీంతో ఆటో కార్మికుల ఆనందానికి హద్దే లేకుండా పోయింది. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆటో కార్మికులకు ఏడాదికి 10 వేల రూపాయల ఆర్థిక సాయం చేస్తానని వైఎస్ జగన్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.