ఎంతో ప్రాధాన్యత కలిగిన మహంకాళి అమ్మవారి బోనాల జాతరకు మన రాష్ట్రం నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా పెద్ద ఎత్తున భక్తులు హాజరు కానున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే వచ్చే నెల ( జూలై ) 29వ తేదీన తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల నిర్వహించనున్నట్లు రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు . బోనాల నిర్వహణపై ఈ రోజు మంత్రి పద్మారావు గౌడ్ తో కలసి అయన సెక్రటేరియట్ లో వివిధ శాఖల అధికారులతో కలిసి సమీక్ష జరిపారు .
ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ..జులై 29న బోనాలు, 30వ తేదీన రంగం నిర్వహించేందుకు ప్రభుత్వ పరంగా అన్ని శాఖల అధికారుల సమన్వయంతో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది అమ్మవారికి బంగారు బోనం సమర్పిస్తున్నామన్నారు. ఈ బోనం తయారీకి కోటి రూపాయల ఖర్చుతో 3 కిలోల 80 గ్రాముల బంగారం వినియోగించనున్నట్లు తెలిపారు. ఈ సమీక్షలో భాగంగా బంగారు బోనం నమూనా ను మంత్రులు విడుదల చేశారు .తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బోనాలను రాష్ట్ర పండుగగా ప్రకటించి నిర్వహిస్తునామన్నారు.