జనసేన అధినేత పవన్ కల్యాణ్తో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ భేటీ అయ్యారు. విజయవాడలోని పటమటలంకలో పవన్ నివాసంలో ఈ సమావేశం జరిగింది. దాదాపు అరగంటపైగా సాగిన ఈ భేటీలో ఇరువురు నేతలు ఏ అంశాలపై చర్చించారన్నది వెల్లడి కాలేదు. అయితే, వీరిరువురి సమావేశం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా కొత్త చర్చ తెరమీదకు వస్తోంది.
సమైక్య రాష్ట్ర విభజన వరకు శాసనసభ స్పీకర్గా బాధ్యతలు నిర్వహించిన నాదెండ్ల మనోహర్ ఆ తరువాత కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నప్పటికీ క్రీయాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. కొంత కాలంగా ఆయన రాజకీయ భవిష్యత్పై రకరకాల ఊహాగానాలు సాగుతున్నాయి. వారం రోజుల క్రితమే నాదెండ్ల మనోహర్ ఢిల్లిలో పీసీసీ అధ్యక్షులు రఘువీరారెడ్డితో కలిసి, పార్టీ అధ్యక్షుడు రాహుల్గాంధీని కలిసి, ఆంధ్రప్రదేశ్లో పార్టీ అభివృద్ధి విషయమై చర్చించిన మనోహర్ ఇంతలోనే ఏమైంది? ఎందుకు పవన్ దగ్గరకు వెళ్లారు? ఆయనతో ఏమి మాట్లాడారు? ఏమేమి చర్చించారు? ఒకవేళ పార్టీ మారే ఆలోచనేదైనా ఉందా? ఇలా అనేక కోణాల్లో విశ్లేషణ సాగుతోంది.
రానున్న ఎన్నికల్లో అవలంభించాల్సిన రాజకీయ అంశాలు, పొత్తులు, పార్టీ అభివృద్ధి గురించి రాహుల్గాంధీతో ఇటీవల ఢిల్లీలో చర్చించిన నాదెండ్ల మనోహర్ , ఆ అంశాలపై పవన్తో చర్చించేందుకే భేటీ అయ్యారనే ప్రచారం జరుగుతోంది. సంవత్సరం వ్యవధిలో అసెంబ్లి ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్తో జనసేన పొత్తు గురించి కూడా చర్చించేందుకే నాదెండ్ల మనోహర్ , జనసేనానిని కలిశారనే మరో సంచలన వార్త వినిపిస్తోంది. రానున్న ఎన్నికల్లో ఇరుపార్టీలు కలిసి పోటీ చేసేందుకు ఉన్న అవకాశాలపై చర్చించేందుకు మనోహర్ , పవన్తో కలిసి చర్చించారంటున్నారు. ఈ నేపథ్యంలో ఇటు జనసేనాని అటు మనోహర్లో ఎవరో ఒకరు నోరువిప్పితే కానీ అసలు విషయం వెలుగులోకి రాదనేది నిజం.