ఏపీ ముఖ్యమంత్రి,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఏరువాక పేరుతో పోటోల కోసం వేసిన నాట్లు ఇప్పుడు ఆయనను అపహాస్యం చేస్తున్నాయి.దీనికి సంబందించి వస్తున్న వార్తలు,వీడియోలు ఆయన పరువు తీస్తున్నాయి. నిజానికి నాట్లు నీరుతో ఉన్న పోలాల్లో వేస్తారు. అలా కాకుండా మామూలు పొలంలో ఆయన నాట్లు వేసినట్లు కనిపిస్తుంది. అవి కూడా రెండు రోజులలో ఎండిపోయాయి.వీటికి సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో విస్తారంగా వ్యాప్తిలోకి వచ్చాయి.దీనిపై సాక్షి ఒక ప్రత్యేక కథనం కూడా ఇచ్చింది.
రెండ్రోజుల క్రితం శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం రావికంటిపేట గ్రామంలోని గ్రీన్ఫీల్డ్ మైదానంలో ఏరువాక పౌర్ణమి పురస్కరించుకుని కాలుకు చెప్పులతో ముఖ్యమంత్రి చంద్రబాబు వేసిన నాట్లు మాత్రం పొలం కాని పొలంలో. ఏరువాక ప్రారంభానికి సూచికగా అక్కడ నిజంగా నాట్లు వేస్తున్నట్లు ఆయన పోజులిచ్చేశారు. కెమేరాలు క్లిక్ క్లిక్మనేశాయి. సీన్కట్ చేస్తే.. అది పొలం కాదని ‘సాక్షి’ పరిశీలనలో తేలింది.
మైదానంలో కంకర, మట్టి తోలి అక్కడ కృత్రిమంగా ఓ మడిని ఏర్పాటుచేశారు. అంతేకాదు.. ఆయన నాటిన వరి నారు 48గంటల్లో ఎండిపోయి వాడిపోయింది. స్థానికులు ఇది చూసి హవ్వా అని ముక్కున వేలేసుకుంటున్నారు.దీనిపై నెట్ లో వస్తున్న కామెంట్లు విశేషంగా ఉన్నాయి.ప్రపంచంలో పబ్లీసిటి కోసం పాకులాడే వారు ఎవరైనా ఉన్నారా అంటే మొదట మన ముఖ్యమంత్రి చంద్రబాబు తరువాతే అని అందరూ చెబుతారు., నీరు లేకుండానే వరి పండించగల సమర్థుడు బాబు, ఎండు పొలంలో వరినాటే టెక్నాలజీ.. బీకాంలో ఫిజిక్స్ చెప్పించే సమర్థత మన టీడీపీ నాయకులకే సాధ్యం అంటూ నెటిజన్లు వీటిపై కామెంట్లు గుప్పిస్తున్నారు.