తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో ఉన్న విబేధాలకు అద్దంపట్టేందుకు మరో ఉదాహరణ ఇది. తాము బలంగా ఉన్నామని, వచ్చే ఎన్నికల్లో తమదే అధికారమని ఓ వైపు కాంగ్రెస్ నేతలు డబ్బా కొట్టుకుంటుంటే..క్షేత్రస్థాయిలో అలాంటి చాన్సే లేదనే పరిణామాలు ఒకదాని వెంట మరొకటి సాగుతున్నాయి. తాజాగా అలాంటి ఘటనే హైదరాబాద్ వేదికగా సాగింది. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సికింద్రాబాద్ పార్లమెంట్ నుండి పోటీ చేస్తానని నిన్న అజారుద్దీన్ వెల్లడించిన సంగతి తెలిసిందే.
దీనిపై గ్రేటర్ అధ్యక్షుడు అంజన్కుమార్ యాదవ్ ఫైర్ అయ్యాడు.అజారుద్దీన్ కు శక్తి సామర్ధ్యాలు ఉంటే హైద్రాబాద్ పార్లమెంటు నుండీ పోటీ చేయాలి అని హైదరాబాద్ నగర కాంగ్రెస్ సమావేశంలో అంజన్ కుమార్ సవాల్ విసిరారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా అంజన్ కుమార్ యాదవ్ పార్లమెంటును వదలడు అని స్పష్టం చేశారు. కాగా, అంజన్ కుమార్ యాదవ్ మాట్లాడుతుంటే సీనియర్ నేత వి.హనుమంతరావు మీటింగ్ లో నుంచి వెళ్లిపోయారు.
దీంతో నగర కాంగ్రెస్ సమావేశంలో ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాని పరిస్థితి నెలకొంది. దీంతో ఇందిరభవన్లో హైదరాబాద్ నగర కాంగ్రెస్ సమావేశం రసాభాసగా జరిగింది. కాగా, ఈ సమావేశానికి రాహుల్ గాంధీ ధూతగా బోసురాజు అనే సీనియర్ నేత వచ్చారు. ఆయన గురించి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్ రెడ్డి మాట్లాడూతూ బోసురాజుగారికి విశేష అధికారాలు ఉన్నాయని, పార్టీ బలపడాలని చెప్పారు. అనంతరం నేతలు ఇలా వాదోపవాదాలు పెట్టుకోవడంతో…అవాక్కవడం రాహుల్ దూత వంతు అయింది.