తెలంగాణ రాష్ట్రం మరో పుష్కరాలకు రెడీ అవుతోంది. రాష్ట్రంలో జరగనున్న బీమా పుష్కరాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు రాష్ట్ర గృహ నిర్మాణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఏర్పాట్లపై సోమవారం సచివాలయంలోని తన చాంబర్లో సమీక్ష జరిపారు.ఈ సమావేశంలో దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శివశంకర్, ఇంజినీర్ ఇన్ చీఫ్ సత్యనారాయణ రెడ్డి, జాయింట్ కమిషనర్ కృష్ణవేణి, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. శాఖలవారీగా పుష్కర ఏర్పాట్లపై మంత్రికి అధికారులు వివరించారు.
సమీక్ష సమావేశంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ… అక్టోబర్ 11 నుంచి 23 వరకు భీమానది పుష్కరాలు జరుగుతాయని తెలిపారు. అక్టోబర్ 11 సాయంత్రం 7:20 గంటలకు గురుగ్రహం వృశ్చిక రాశిలో ప్రవేశించడంతో పుష్కరాలు ప్రారంభమవుతాయని చెప్పారు. రాష్ట్రంలో కేవలం మహబూబ్ నగర్ జిల్లాలోనే భీమానది ప్రవహిస్తోంది కాబట్టి కొద్దిపాటి ప్రాంతంలోనే పుష్కర ఘాట్లు నిర్మించాల్సి ఉంటుందన్నారు. భక్తులు పుష్కర స్నానాలు ఆచరించడానికి శుక్ర లింగంపల్లి, కుసుమూర్తి, తంగిడిగి వద్ద పుష్కర ఘాట్లు నిర్మించాలన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఘాట్ల వద్ద షవర్లు ఏర్పాటు చేయాలని, దుస్తువులు మార్చుకోవాడానికి రూంలను, రోడ్లు, పార్కింగ్ స్థలాలు, తాగునీటి సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.
బీమానది వరకు పోవడానికి రహదారుల సౌకర్యం కూడా సరిగా లేనందున, త్వరితగతిన రహదారులు నిర్మించాలని మంత్రి చెప్పారు. పుష్కర ఏర్పాట్ల కోసం వివిధ శాఖలు చేపట్టే పనులకు రూ.12 కోట్లు వ్యయం అవుతుందని అధికారులు మంత్రికి వివరించారు. గతంలో 2006 లో భీమానది పుష్కరాలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్ నగర్ జిల్లా క్రిష్ణా మండలం శుక్ర లింగంపల్లి వద్ద భీమానది ప్రవేశించి, కుసుమూర్తి,కేదహళ్లి గ్రామాల మీదుగా ప్రవహించి తంగిడిగి వద్ద కృష్ణా నదిలో కలుస్తుంది.