ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుపై ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్గాంధీ చేసిన ఆరోపణలను ఖండిస్తున్నట్లు టీఆర్ఎస్ ఎంపీ వినోద్ అన్నారు. రాష్ట్ర పర్యటన సందర్భంగా భైంసా, కామారెడ్డిలో రాహుల్ చేసిన వ్యాఖ్యలపై ఎంపీ వినోద్ స్పందించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాజెక్టుకు పేరు మార్చినట్లు రాహుల్గాంధీ చేసిన ఆరోపణలను ఖండిస్తున్నట్లు ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఇప్పటికీ ప్రాణహిత-చేవెళ్ల పేరు డా. బీఆర్ అంబేద్కర్ పేరు మీదనే కొనసాగుతుందన్నారు. 2013 భూసేకరణ చట్టానికి ఎలాంటి మార్పులు చేయలేదని.. పరిస్థితులకు అనుగుణంగా సవరణలను మాత్రమే చేసినట్లు వెల్లడించారు.
రైతుల ఆత్మహత్యలు కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లోనే ఎక్కువన్నారు. తెలంగాణలో జరిగిన ఆత్మహత్యలు కూడా గత కాంగ్రెస్ పాలన ఫలితమేనని దుయ్యబట్టారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం వచ్చినంక రైతుల ఆత్మహత్యలు తగ్గినయినట్లు తెలిపారు. ప్రాజెక్టుల అవినీతి గురించి రాహుల్గాంధీకి అవగాహన లేదన్నారు. గత కాంగ్రెస్ పాలనలోనే జలయజ్ఞం పేరిట ధనయజ్ఞం జరిగిందన్నారు. కాంగ్రెస్ అంటే బోఫోర్స్.. బీజేపీ అంటే రాఫెల్ అన్నారు. రెండు పార్టీలు అవినీతిమయమే. కాంగ్రెస్ నాయకులు ప్రజల్లో లేరు. వారికి కోర్టుల చుట్టూ తిరగడమే సరిపోతుందని ఎంపీ వినోద్ పేర్కొన్నారు.