నెట్ఫ్లిక్,హాట్ స్టార్,అమెజాన్ ప్రైమ్ లాంటి పేర్లు ఎక్కువగా వినిపిస్తున్న కాలంలో…PVR దేశంలోనే అత్యధిక మల్టీప్లెక్స్ స్క్రీన్ లు కలిగిన సంస్థ తన వ్యాపారాన్ని మరింత విస్తరించే ఆలోచనలో ఉంది. అజయ్ బిజ్లీ సారధ్యంలో నడుస్తున్న ఈ సంస్థ ఇప్పటికి దేశవ్యాప్తంగా దాదాపు 750 సినిమా స్క్రీన్లు కలిగి ఉన్నది. అయితే రానున్న మూడు నాలుగేళ్ళలో మరో 1000 సినిమా స్క్రీన్ లు నిర్మించాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.ఈ సంస్థ సీఈఓ గౌతమ్ దత్త మాట్లాడుతూ…రానున్న కాలంలో వ్యాపార విస్తరణ కోసం రూ.2500 నుండి రూ.3000 కోట్లు పెట్టుబడులు పెట్టడానికి సంస్థ సిద్ధంగా ఉందని చెప్పారు.
ప్రస్తుత రోజుల్లో ఎక్కువుగా వినిపిస్తున్న అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్ లాంటి అప్లికేషన్లు సినిమా ప్రేమికులపైనా ఎటువంటి ప్రభావం చూపవని, గతంలో IPL వచ్చినప్పుడు కూడా ఇలానే అన్నారని చెప్పారు.
ప్రజలు సరదాగా ఇంటి నుండి బయటకు రావటానికి ఇష్టపడతారని, కనుక ఇలా ఇంట్లో కూర్చుని ఫోన్లో చూసేవి ఎన్ని వచ్చినా థియేటర్ కు వచ్చి సినిమా చూడటంలో ఉన్న అనుభూతి వేరని చెప్పుకొచ్చారు.ఎప్పటికప్పుడు వస్తున్న సాంకేతికతను ఉపయోగిస్తూ, నాణ్యత పెంచుతూ ప్రేక్షకులకు మంచి అనుభూతిని ఇవ్వటమే సంస్థ లక్ష్యమని చెప్పారు.