ఒక్కోసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నోటి వెంట ఆణిముత్యాలు దొర్లుతుంటాయి. అలాంటి ఆణిముత్యాలే విజయవాడ జనసేన కార్యాలయంలో కార్యకర్తలతో మాట్లాడుతూ దొర్లించారు..ప్రజారాజ్యం పార్టీ ఉండి ఉంటే సామాజిక న్యాయం జరిగేది. కానీ ఓపిక లేని నాయకులు పీఆర్పీలో చేరడం వల్ల ఆ అవకాశం చేజారిపోయింది. ఆ రోజు ప్రజారాజ్యంలోకి వచ్చినవారంతా పదవీ వ్యామోహంతో చిరంజీవి లాంటి బలమైన వ్యక్తిని బలహీనుడిగా మార్చేశారు.
ప్రజారాజ్యం పార్టీ వుండి వుంటే సామాజిక న్యాయం జరిగేది.ఇది నిజమే అనుకోవాలి ఎందుకంటే ఎన్టీఆర్ పార్టీ పెట్టినపుడు, జగన్ పార్టీ పెట్టినపుడు రాని టిక్కట్ల అమ్మకం ఆరోపణలు, విమర్శలు వచ్చింది ప్రజా రాజ్యం పెట్టినపుడే. ఆ మాటకు వస్తే మరే పార్టీ స్థాపన సమయంలో కూడా ఇలా టికెట్ల అమ్మకం విమర్శలు రాలేదు.ఓపికలేని నాయకులు పీఆర్పీలో చేరడం వల్ల అవకాశం చేజారిపోయింది? ఎవరికి ఓపిక లేదు. ఎవరు పార్టీని కాంగ్రెస్ లో కలపడానికి తహతహలాడారు? ఎవరు ఆ విధంగా లబ్ది పొందారు.కేంద్రంలో మంత్రి పదవి తెచ్చుకున్నది ఎవరు?చిరంజీవి లాంటి బలమైన వ్యక్తిని బలహీనుడిగా మార్చేసారు..
నిజంగా చిరంజీవి అంత బలమైన వ్యక్తి అయితే పార్టీని అయిదేళ్ల పాటు కనీసం రన్ చేసి వుండేవారు.2014లో ఓడిపోయింది వైకాపా.కానీ జగన్ దేంట్లోకి తీసుకెళ్లి కలిపేయలేదు. ప్రజల్లోనే వుండి పోరాడారు. చిరంజీవి ప్రత్యేక ఉద్యమంలో కావచ్చు. హోదా ఉద్యమంలో కావచ్చు. తన బలం ఏమిటో వన్ పర్సంట్ కూడా ప్రధర్శించలేకపోయారు.
పవన్ కళ్యాణ్ పదవులు అవే వస్తాయని, వాటి కోసం పాకులాడ వద్దని కార్యకర్తలకు, నాయకులకు చెబుతున్నారు. కానీ ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో కలిపివేసినందుకు వచ్చింది కేంద్రంలో ఓ మంత్రి పదవి, అది కూడా తన సోదరుడు చిరంజీవికి అన్నది మరిచిపోతే ఎలా? కార్యకర్తలకు చెప్పడానికే నీతులు వుంటాయేమో?