ఒక దేశపు రాజ్యాంగ అమలు ప్రారంభమైన రోజున ఆ దేశము గణతంత్ర దేశంగా ప్రకటించుకోవడం జరుగుతుంది.అలా ప్రకటించి జరుపుకునే “జాతీయ పండుగ” ఈరోజు.మన దేశానికీ 1950 జనవరి 26న రాజ్యాంగం అమలులోకి వచ్చింది.కావున ఈ రోజున గణతంత్ర దినోత్సవము గౌరవంగా జరుపు కుంటారు.ఈ రోజున బ్రిటీషు కాలంలో భారత ప్రభుత్వ చట్టం 1935 రద్దయి, భారతదేశం సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా ఏర్పాటయింది.
భారతదేశానికి 1947 ఆగస్టు 15 న స్వాతంత్ర్యము వచ్చింది. దేశానికి రాజ్యాంగము తయారు చేయటానికి రాజ్యాంగ పరిషత్ ఏర్పడింది. దీనికి అధ్యక్షుడుగా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ఎన్నికయ్యారు. 1947 ఆగస్టు 29 న డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ఛైర్మన్ గా రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఏర్పడింది. రాజ్యాంగము తయారు చేయడానికి ఎంతోమంది మేధావులు ఎన్నో దేశాల రాజ్యాంగాలను పరిశీలించి ప్రజాస్వామ్య విధానంగా రూపుదిద్దారు. అనేక సవరణల అనంతరము 1949 నవంబర్ 26 న భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది. భారత రాజ్యాంగానికి 2 సంవత్సరాల, 11 నెలల, 18 రోజుల కాలము పట్టింది. ప్రపంచములోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగముగా గుర్తించబడింది. అలా తయారైన రాజ్యాంగాన్ని 1950 జనవరి 26 నుంచి అమలుపరిచడంతో భారతదేశము సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యముగా రూపొందడంతో పరిణామ దశ పూర్తయింది.
భారతదేశానికి మూడు జాతీయ సెలవు దినాలలో ఇది ఒకటి. మిగతావి స్వాతంత్ర్య దినోత్సవం మరియు గాంధీ జయంతి.ఈ రోజు డిల్లీలో పరేడ్లు నిర్వహిస్తారు.సాహస బాల బాలికలకు భారత రాష్ట్రపతి పురస్కారాలు అందజేస్తారు.