ఈ నెల 17న వైసీపీ ఆధ్వర్యంలో పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో తలపెట్టిన బీసీ గర్జన పోస్టర్ను విడుదల చేశారు. కర్నూలు వైసీపీ కార్యాలయంలో పార్టీ నాయకులు కాటసాని రాంభూపాల్రెడ్డి, బీవై రామయ్య తదితరులు పోస్టర్ విడుదల చేశారు. కాటసాని మాట్లాడుతూ ఎన్నికల సమయంలో బీసీలకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని, నిధులు కేటాయిస్తానని ఓట్లు వేయించుకున్న చంద్రబాబు మోసం చేశారని చంద్రబాబు బీసీలను ఓటు బ్యాంకుగానే చూశారని విమర్శించారు. ఎన్నికల వేళ ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.
అధికారంలో 57 నెలలు ఉన్న చంద్రబాబు ఎన్నికలకు రెండు నెలల ముందు 22 కార్పొరేషన్లు ఏర్పాటు చేయడమేంటని ప్రశ్నించారు. ఆదరణ పథకం కింద తుప్పుపట్టిన పనిముట్లు పంపిణీ చేసి బీసీల జీవన ప్రమాణాలను మరింత దిగజార్చారన్నారు. 40 ఏళ్ల అనుభవం అని చెప్పుకుంటున్న చంద్రబాబు జగన్ పథకాలను కాపీ కొట్టడం తగదన్నారు. వైసీపీ ఆధ్వర్యంలో బీసీ అధ్యయన కమిటీ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి బీసీల సమస్యలను తెలుసుకుందన్నారు. అందులో భాగంగా 17వ తేదీ ఏలూరులో లక్ష మంది బీసీలతో భారీ బీసీ గర్జన నిర్వహించేందుకు పార్టీ ఏర్పాట్లు చేస్తోందన్నారు.
ఈ సభలోనే బీసీ డిక్లరేషన్ను తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విడుదల చేయనున్నారని తెలిపారు. బీసీ గర్జనతో చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరుగెడుతాయని బీసీ అధ్యయన కమిటీ రీజినల్ కో ఆర్డినేటర్ పుల్లయ్య అన్నారు. బీసీల సమస్యలు పరిష్కరించి, న్యాయం చేయాలని కోరినవారిని చంద్రబాబు కించపరిచేలా మాట్లాడాటం తగదన్నారు. నాయీ బ్రాహ్మణుల తోకలు కత్తిరిస్తారని, మత్స్యకారులకు తాట తీస్తానని హెచ్చరికలు జారీచేసారన్నారు. జగన్మోహన్ రెడ్డితోనే బీసీల సంక్షేమం సాధ్యమవుతుందని పార్టీ ప్రధాన కార్యదర్శి కాటసాని రాంభూపాల్రెడ్డి అన్నారు. ఇచ్చిన ప్రతి హామీనీ నెరవేర్చుతారని స్పష్టం చేశారు.