ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఆయన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.బాబుపై సోషల్ మీడియాలో వస్తున్న తిట్లు, కామెంట్లు చూస్తుంటే…జాలేస్తోందని…సీఎం కుర్చీలో తాను ఉంటే కనుక ఒక్క గంట కూడా కూర్చోలేనని ఆయన అన్నారు.నా తోడల్లుడుపై అసూయ పడటం లేదని, కేవలం జాలి పడుతున్నానని అన్నారు.
దగ్గుబాటి వెంకటేశ్వరరావు మంగళవారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. ‘నా తోడల్లుడు చంద్రబాబు సృష్టిలోనే వింత జీవి. నిన్న ఒకమాట…నేడు ఒకమాట.. మాట్లాడుతున్నారు. పోలవరం ప్రాజెక్ట్, ప్రత్యేక హోదాపై ఎప్పుడు ఏం మాట్లాడతారో ఆయనకే తెలియదు.రాజధాని భూములను నచ్చినవారికి నచ్చిన రేటుకు ఇస్తున్నారు.కేంద్రం నుంచి వచ్చిన నిధులను వృధా చేస్తూ చిన్న చిన్న పనులు చేయిస్తున్నారని అన్నారు. కేంద్రానికి తప్పుడు నివేదికలు ఇస్తున్నారు. కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ నిర్మాణం ఏళ్ల తరబడి అలా జరుగుతూనే ఉంది. ఉక్కు ఫ్యాక్టరీ, రామాయపట్నం పోర్టుల గురించి టీడీపీ కేంద్రానికి నివేదికలు ఇవ్వలేదు.ఇప్పుడు ఎన్నికల దగ్గర పడుతున్నాయి కాబట్టి మేమే చేస్తామని ఇప్పుడు శంకుస్థాపనలు చేస్తున్నారు.
చంద్రబాబు అధికారం కోసం ఎంతటి నీచానికైనా దిగజారుతారు.పోలీస్ వ్యవస్థతో పాటు తన కింద ఉన్న అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించారు. వైసీపీ ఎమ్మెల్యేలను కొనే బాధ్యతను ఇంటెలిజెన్స్ ఐజీకి అప్పగించారు.అయితే ఐజీ ప్రతిపక్షంలో ఉన్నవారికి కాంట్రాక్టులు అప్పచెపుతామని వారిని మందలించడానికి ప్రయత్నిస్తున్నారు.ఇక స్పీకర్ వ్యవస్థను అయితే చెప్పాల్సిన అవసరమే లేదు.ఇక ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ జర్నలిజాన్ని నిర్వీర్యం చేశారు. చంద్రబాబు రాధాకృష్ణ కలిసి జర్నలిజాన్ని మాయని మచ్చ తీసుకొచ్చారు.బాబు హయంలో కడుతున్న ఏ ప్రాజెక్టుల్లో ఐన సరే రాధాకృష్ణకు కమీషన్లు అందుతాయి.పట్టిసీమ, పోలవరం, హంద్రీనీవా పనుల్లో భారీగానే డబ్బు అందింది.రాధాకృష్ణ జర్నలిజం ఎప్పుడూ కూడా ప్రజలకు మేలు చేసేలా అయితే లేదు.కేవలం రాజకీయ నాయకులకు ఊడిగం చేసేలా అనిపిస్తుందని ఆయన చెప్పారు.