వంగవీటి రాధాకృష్ణకు ఊహించని షాక్ తగిలింది. వైసీపీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీకి చేరనున్నట్లు ప్రకటించిన రాధాకు ఆయన కుటుంబ సభ్యుల నుంచే మద్దతు దక్కడంలేదు. వంగవీటి ఫ్యామిలీకి చెందిన మరో యువనేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. వంగవీటి నరేంద్ర వైసీపీ నేతలతో టచ్లోకి వచ్చారని సమాచారం.
అర్ధరాత్రి మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్తో కలిసి సీఎం చంద్రబాబుతో సుదీర్ఘ మంతనాలు సాగించిన రాధాకృష్ణ.. టీడీపీకి గూటికి చేరనున్నట్లు ప్రకటించారు. అయితే, వంగవీటి ఫ్యామిలీకి చెందిన మరో యువనేత వంగవీటి నరేంద్ర వైసీపీ నేతలు మంతనాలు సాగిస్తున్నారు. ఆయనతో విడివిడిగా వైసీపీ నేతలు భేటీఅయ్యారు. విజయవాడలోని ఓ హోటల్లో వంగవీటి నరేంద్రను వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా కలిశారు. అంతకు ముందు మరోచోట నరేంద్రతో కృష్ణ జిల్లా ఎన్నికల పరిశీలకుడు అప్పిరెడ్డి చర్చలు జరిపారు.
ఈ విషయంపై స్పందించిన ఎమ్మెల్యే ముస్తఫా పార్టీలోకి వంగవీటి నరేంద్రను ఆహ్వానిస్తున్నామని తెలిపారు. వంగవీటి రాధాకృష్ణ వైసీపీని వీడినా పార్టీలో మాత్రం వంగవీటి బ్రాండ్ ఉండేలా పరిణామాలు మారుతుండటంతో టీడీపీ నేతలు షాక్ తిన్నట్లు సమాచారం.