చంద్రబాబు దిగజారి మాట్లాడుతున్నారని వైసీపీ నగరి అభ్యర్థి రోజా మండిపడ్డారు. ప్రభుత్వం తనకు సహకరించకపోయినా తనకు వచ్చే ఆదాయంతోనే నియోజకవర్గ ప్రజలకు సాయం చేస్తున్నానన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నగరి నియోజకవర్గంలో ఉన్న చేనేత, చెరుకు పరిశ్రమలను అభివృద్ధి చేస్తానని తెలిపారు. టీడీపీ రంగులు వేసుకునే ఎన్టీఆర్ పార్టీ అని, ఆ పార్టీతో చంద్రబాబుకు పనేంటని ప్రశ్నించారు. అలాగే బాలకృష్ణ రంగులు వేసుకుని తన కూతురు వయసున్న వారితో డ్యాన్సులు వేస్తున్నారన్నారు. అలాంటివారికి ఎందుకు ఎమ్మెల్యే సీటిచ్చావని ప్రశ్నించారు.
చంద్రబాబుకు నోరుంది కదా అని మాట్లాడితే ప్రజలు నమ్మరన్నారు. నటన అనేది నా వృత్తి అని, నటిగా నన్ను గౌరవించి ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారని తెలిపారు. నాకు వచ్చే ఆదాయంతో నాలుగు రూపాయలకే భోజనం పేదవారికి పెడుతున్నాను, ఆర్వో ప్లాంట్ ద్వారా రెండు రూపాయలకే నీళ్లు ఇస్తున్నాను, స్కూళ్లకు వాటర్ ఫ్యూర్ఫైర్స్, ఫ్యాన్లు పంపిణీ చేస్తున్నానని తెలిపారు. చంద్రబాబు అధికారంలో ఉండి ఏం చేశారని రోజా ప్రశ్నించారు. కనీసం చంద్రబాబు ఇచ్చిన వాగ్ధానాలు కూడా నెరవేర్చలేదన్నారు. ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్న తనకు అభివృద్ధి ఫండ్స్ ఇవ్వకుండా ప్రజలను మోసం చేశారని రోజా ఆగ్రహించారు.