శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన తన కుటుంబ సభ్యులు, శ్రీలంక ప్రభుత్వ అధికారులు, సిబ్బంది తో కలిసి ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల పద్మావతి గెస్ట్ హౌస్ నుంచి ఈ రోజు ఉదయం 6:10 గంటలకు మహాద్వారం చేరుకున్న సిరిసేనకు టిటిడి ఈఓ అనిల్ కుమార్ సింఘాల్, జేఈవో శ్రీనివాస రాజు, శ్రీవారి ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి శ్రీవారి దర్శనానికి వెంట ఉండి తీసుకెళ్లారు.
ముందుగా సిరిసేన తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి ఆలయ ధ్వజస్తంభానికి మొక్కి అనంతరం బంగారు వాకిలి గుండా వెళ్లి శ్రీవారి గర్భాలయ బయట నిలబడి శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం, వకుళామాత దర్శనం, విమాన వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని, శ్రీవారి హుండీలో కానుకలు సమర్పించారు.
అలాగే, రంగనాయకుల మండపంలో వేదపండితులు మైత్రిపాల దంపతులకు వేదాశీర్వచనాలు అందించి, తీర్థ ప్రసాదాలను అందించారు. అనిల్, శ్రీనివాస రాజులు శ్రీ పద్మావతి సమేత శ్రీవారి చిత్ర పటాన్ని, ప్రసాదాలను దంపతులకు అందించారు. శ్రీవారి దర్శనం అనంతరం అధ్యక్షుడు తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీ పద్మావతి అధితి గృహానికి చేరుకున్నారు. ఈ సాయంత్రం రేణిగుంట ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో బెంగళూరుకు బయలుదేరి వెళ్లనున్నారు.