Home / EDITORIAL / ఇది ఉద్యోగులు,ఉద్యోగాల పంచాయితీ కాదు. ఒక దీర్ఘకాలిక ఆలోచన.

ఇది ఉద్యోగులు,ఉద్యోగాల పంచాయితీ కాదు. ఒక దీర్ఘకాలిక ఆలోచన.

ప్రస్తుతం రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పురపాలన, గ్రామపంచాయతీల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో అందరికీ తెలిసిన విషయమే. పంచాయతీ ఒక లే అవు ట్ ఆమోదిస్తుంది. లే అవుట్ చేసిన వ్యక్తి అందులోని ప్లాట్లను కొందరికి అమ్ముతారు. రిజిస్ట్రేషన్ల్ల శాఖ దస్తావేజులు రిజిస్టరు చేస్తుంది. కొన్న వారికి రిజిస్ట్రేషన్ దస్తావేజులు చేతికి వస్తాయి. కానీ భూమి హక్కు పత్రం మాత్రం రాదు. లే అవు ట్ చేసిన భూమి యాజమాన్య హక్కు మాత్రం పాత యజమాని పేరుమీదే ఉంటుంది. కొద్దికాలం గడచిన మీదట అదే భూమిని మరొకరికి అమ్ముతారు. మరొకరు లేఅవుట్ చేస్తారు. మళ్లీ కొంటా రు. మళ్లీ రిజిస్ట్రేషన్ చేస్తారు. మళ్లీ దస్తావేజులు చేతికి వస్తాయి. భూమి మాత్రం యజమాని పేరు మీదే ఉంటుంది. మళ్లీ అదే తంతు. అదే పంచాయితీ. ఇది కొన్ని దశాబ్దాలుగా యథేచ్ఛ గా జరుగుతున్నది. రెవెన్యూ, పంచాయతీ / పురపాలక శాఖ, రిజిష్ర్టేషన్ల శాఖలు ఎవరి చేతులు వారు దులిపేసుకుంటున్నారు. ప్లాట్లు కొన్న సామాన్యులు మాత్రం వీధుల్లో పడిపోతున్నారు.

కోర్టుల చుట్టూ తిరుగుతున్నా రు. హైదరాబాద్ మహానగ రం మొదలుకొని పల్లెటూర్ల దాకా ఇదే దుస్థితి. కొన్ని వందల లేఅవుట్లు మూడునాలుగు సార్లు మారి అమ్మకమయినవే. అందరివద్దా పత్రాలుంటాయి. నాదంటే నాదని జనం తన్నుకోవలసిన దుస్థి తి. ఈ అవ్యవస్థను మార్చే ప్రయత్నం ఎవరూ చేయలేదు. ఎందుకంటే అందరికీ ఆదాయం పండించే వ్యవస్థలివి. అంతాసాఫీగా జరిగిపో తే ఈ వ్యవస్థలకు పని ఉండ దు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే కొంత కొత్త ఆలోచనా విధా నం అమలు చేసే ప్రయత్నం జరిగింది. రిజష్ర్టేషన్ల విభాగాన్ని, రెవెన్యూ విభాగాన్ని సంధానించి, ఎప్పటికప్పుడు రెవెన్యూ రికార్డులను నవీకరించే విధంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించే ప్రయత్నం జరిగింది. అయితే అది పూర్తిస్థాయిలో ఫలితాలు ఇవ్వ డం లేదు. ఆ అనుసంధాన వ్వవస్థ సరిగా పనిచేయడం లేదు. రిజిష్ర్టేషన్ల విభాగం నుంచి వివరాలు కలెక్టర్‌కు వెళితే ఆయన ఆమోదం మేర కు రికార్డులను సరిచేసే విధంగా వ్యవస్థను రూపొందించారు. కానీ కలెక్టర్‌కు ఎన్ని పనులు? ఏదని ముందుగా చేస్తారు? ఆచరణలో ఇన్ని పనులు కలెక్టరు చేయడం సాధ్యమేనా? అందుకే ఆ ఏర్పాటు పూర్తిస్థాయిలో అమలు కాకుండానే ఉండిపోయింది.

గత ఆరు దశాబ్దాల ఉమ్మడి పాలనలో తెలంగాణలో భూరికార్డుల నిర్వహణ వ్యవస్థ అస్తవ్యస్తమయింది. వెనుకటికి శిస్తు వసూలు, నిరంతర జమాబందీ కొనసాగేది. ఎవరి భూమి రికార్డులు వారికి అందుబాటులో ఉండేవి. గ్రామాల్లో పట్వారీలు రికార్డులను నిర్వహించేవారు. జనం ఎదుట, జనం మధ్య ఉండే పట్వారీలు సాధారణంగా తప్పులు చేసేవారు కాదు. ఇప్పుడు జరిగినట్టే అప్పుడూ కొందరు అడ్డగోలుగా వ్యవహరించి ఉండవచ్చు. గ్రామాల్లోనే పంచాయితీలు పెట్టి అక్కడికక్కడే పరిష్కారం చేసేవారు. భూస్వా మ్య ప్రభావం ఉన్న గ్రామాల్లో పట్వారీలు కొంత దాష్టీకం చేసినా తెలంగాణలో వచ్చిన వివిధ ఉద్యమాల ప్రభావం వల్ల అక్కడ కూడా పరిస్థితులు మారాయి. నాటి ముఖ్యమంత్రి ఎన్‌టీఆర్ తన నాచారం భూముల విషయంలో సహకరించలేదన్న కోపంతో పట్వారీ వ్యవస్థపై విరుచుకుపడ్డారు. పటేల్, పట్వారీ వ్యవస్థను రద్దు చేయడమే కాకుండా అదో విప్లవకార్యంగా ప్రచారం చేశారు. రెవెన్యూ వ్యవస్థలో ఆ తర్వాత జరిగిన అరాచకాలు అన్నీ ఇన్నీ కాదు. బయటివాళ్లు తెలంగాణలో భూములు కొనాలంటే తెలంగాణ అభివృద్ధి మండలి ఆమోదం పొందాలన్న నిబంధన ఒకటి ఉండేది. దానిని నీలం సంజీవరెడ్డి కాలంలోనే తుంగలో తొక్కారు.
ఇప్పటికీ ఈ నిబంధన హైదరాబాద్ కర్ణాటకలో కొనసాగుతున్నదని చెబుతారు. తెలంగాణలో మాత్రం భూ మాఫియా రెక్కలు విప్పుకుని స్వైర విహారం చేసింది. తెలంగాణలో భూముల రకాలు ఎక్కువ. వాటిని చట్టప్రకారం నిర్వచించి, రక్షణ కల్పించవలసిన అవసరం ఉండె. అవేవీ పట్టించుకోలేదు. హైదరాబాద్ పరిసరాల్లో కొన్ని లక్షల ఎకరాల భూమి పాయగాల పేరిట, ఎనిమీల పేరిట, వక్ఫ్ పేరిట, ఇనాంల పేరిట, భూదాన్‌ల పేరిట, అసైన్‌మెంట్ పేరి ట, పోరంబోకు, బంజరు పేరిట భూములు వుండేవి. వాటిని యథేచ్ఛగా ఖతం పట్టించారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఆంధ్ర ప్రాంత రెవెన్యూ అధికారులను, రిజిస్ట్రేషన్ అధికారులను తెచ్చి కూర్చోబెట్టారు. ఒకానొక దశలో హైదరాబాద్ పరిసరాల్లో కీలకమైన ప్రదేశాల్లో రిజస్ట్రార్లు, సబ్ రిజిస్ట్రార్లు, ఎమ్మార్వోలు అంతా ఆంధ్ర ప్రాంతం వారే. హైదరాబాద్‌లో ఎటువంటి భూమినయినా రిజస్ట్రేషన్ చేస్తూ పోయారు.

మరోవైపు భూమాఫియా రెవెన్యూ రికార్డులను మాయం చేయ డం, ఆఫీసుల్లో కృత్రిమ అగ్ని ప్రమాదాలు సృష్టించడం జరిగిపోయింది. ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించడం కూడా ఇష్టారాజ్యంగా జరిగింది. పట్వారీ వ్యవస్థ స్థానంలో సరైన వ్యవస్థను ప్రవేశపెట్టారా అంటే అదీ జరుగలేదు. కొత్తగా వీఆర్వోలు, వీఆర్‌ఏలుగా కొంతమందిని నియమించారు. అది కూడా పదూళ్లకు ఒకరిని పెడితే ఆయన రికార్డులన్నీ చూడడం, తాజా భూమార్పిడి లావాదేవీలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు నవీకరించడం కష్టమయ్యేది. వారికి రికార్డుల నిర్వహణలో తగిన శిక్షణ లేదు. వారికి అనుభవం లేదు. క్లరికల్ మైండ్‌సెట్ తప్ప, రెవెన్యూ మైండ్‌సెట్ చాలామందికి లేదు. చాలామందికి భూమి లెక్కలు తెలియవు. ఎలా కొలవాలో, ఎలా హద్దులు గుర్తించాలో…వంటి క్షేత్రజ్ఞానం లేదు. భూములు కొలిచేందుకు గతంలో ఊరికి నలుగురైదుగురు పెద్దమనుషులు ఉండేవారు. గొలుసులు పట్టి లెక్క తీయడం, హద్దు రాళ్లు గుర్తించడం, కొత్తగా పెట్టడం వంటివి క్షుణ్ణంగా తెలిసేది వారికి. ప్రభుత్వ సర్వేయర్లు ఉండేవారు, కానీ చాలా తక్కువమంది. గ్రామాల్లో పంచాయితీ తేలనప్పుడు పైదాకా వెళ్లేది.

ఇప్పుడు కొత్తతరం ఈ లెక్కలు తెలుసుకునే ప్రయత్నం లేదు. సర్వేయర్ల వ్యవస్థను ఉమ్మడి రాష్ట్రం లో పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతే సర్వేయర్ల శిక్షణ, నియామకంపై ప్రత్యేక శ్రద్ధపెట్టింది. వీఆర్వోలు, వీఆర్‌ఏలను పెద్ద సంఖ్యలో నియమించింది. ఇవన్నీ చేసిన తర్వాతనే ఇప్పుడు రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళనపై దృష్టిని కేంద్రీకరించింది. దీనిని రెవెన్యూ శాఖను టార్గెట్ చేయడంగా కొందరు భావిస్తున్నా రు. కానీ ప్రజల బాగోగులను పట్టించుకోవడం అంటే మొదటగా సంస్కరించాల్సింది రెవెన్యూ విభాగాన్నే. ఎందుకంటే ప్రజలకు భూమి ప్రాణాధారం. భూమికోసం జనం ప్రాణమిస్తారు. ఆ భూమి పత్రాలు సరిగా లేకపోతే ప్రజలు విలవిలలాడిపోతారు. నిజమే…భూరికార్డుల ప్రక్షాళన మహాయజ్ఞంగా పూర్తి చేసింది రెవె న్యూ సిబ్బందే. దాదాపు 98 శాతం మందికి పట్టాలు సక్రమంగా ఇచ్చిన మాటా వాస్తవమే. వారు అందుకు అభినందనీయులే. కానీ ప్రతి గ్రామంలో ఆ రెండు శాతం మంది ఉంటే తలెత్తే పరిస్థితులేమిటో రెవెన్యూ సిబ్బంది ఆలోచించాలి. తొంభై మందికి రికార్డులు సరిచేసి పది మందికి చేయకపోతే ఆ పదిమంది దుఃఖం మిగిలిన తొంభైమందికి, మొత్తంగా ప్రభుత్వానికి, రాజకీయ నాయకత్వానికి అతిపెద్ద క్షోభ అవుతుంది. ఆ పదిమందే రోజూ ఆఫీసుల చుట్టూ తిరుగుతారు. ఆ పదిమందే కోర్టులకెళతారు. వారే ఎక్కడబడితే అక్కడ అధికారులను, ప్రభుత్వాన్ని శాపనార్థాలు పెడుతుంటారు.

ఇటువంటి పరిస్థితి ఎందుకుండాలి? ఒక పారదర్శకమైన, స్వచ్ఛమైన రెవెన్యూ రికార్డుల వ్యవస్థ ఎందుకు ఆవిష్కరించకూడదు? అనేక ప్రపంచ దేశాలు రెవెన్యూ రికార్డుల వ్యవస్థను ఆన్‌లైన్ చేశా యి. అమెరికా, కెనడా, బ్రిటన్, ఇంకా అనేక యూరోపు దేశాల్లో భూవివాదాల వ్యాజ్యాలు అతి స్వల్పం అని చెబుతున్నారు. అక్కడ భూమి కొన్నా, ఇళ్లు కొన్నా, అపార్టుమెంటు కొన్నా…కొన్నవెంటనే అన్ని రికార్డుల్లో నమోదవుతుందని అక్కడ నివసిస్తున్న మనవాళ్లు చెబుతున్నారు. భూమికోసం కొట్లాడుకోవడాలు, చంపుకోవడాలు ఉండవని చెబుతున్నారు. ఇంత సాంకేతిక విప్లవం వచ్చిన తర్వాత ఇంకా ఈ భూమికోసం తన్నుకోవడాలు మన దగ్గర మాత్రం ఎందుకుండాలి? గూగుల్ ఎర్త్ వచ్చిన తర్వాత ఇంట్లో కూర్చుని నీ భూమి ఎంత ఉందో కొల్చుకునే వెసులుబాటు వచ్చింది. ఉపగ్రహ సాంకేతిక సాయంతో ప్రతి అంగుళాన్ని లెక్కించే అవకాశాలు చేతికి వచ్చాయి. ఒక్క రెవెన్యూ విభాగమే కాదు పురపాలక విభాగంలో కూడా ఎంత నిర్లక్ష్యమో! వందలాది లేఅవుట్‌లు ఆమోదిస్తున్నారు. ప్రతి లేఅవుట్‌లో పార్కుకోసం, క్రీడలకోసం స్థలం కేటాయిస్తారు. ఆ స్థలాలను పురపాలకశాఖ వెంటనే ఎందుకు స్వాధీనం చేసుకోదు? పురపాలక శాఖ పేరుమీదికి ఆ పార్కు స్థలాలను ఎందుకు మార్పించరు? బోడుప్పల్‌లో ఇటీవల అక్కడ కమిషనర్ ఒక ప్రయోగం చేశారు. పార్కు స్థలాలు, ప్రభుత్వ స్థలాలను జియో ట్యాగింగు చేసి అక్కడ ఎవరూ కొనకుండా, అమ్మకుండా తమ అధీనంలోకి తీసుకున్నారు.

మహానగరమంతటా ఆ పని ఎందుకు చేయరు? లేఅవుట్ ఆమోదించగానే పార్కులు, స్కూళ్లు, క్రీడలకోసం కేటాయించిన స్థలాలను ఎందుకు స్వాధీనం చేసుకోరు? అధికారుల నిర్లక్ష్యం లేదా అధికారుల కుమ్మక్కు కారణంగా ఆ స్థలాలన్నీ మళ్లీ మళ్లీ ప్లాట్లు అవుతున్నాయి. అమ్ముతున్నారు. రిజస్ట్రేషన్లశాఖ యథాలాపంగా రిజస్టరు చేస్తూ పోతుంది. రెవెన్యూ శాఖ ప్రేక్షక పాత్ర పోషిస్తుంది. పెద్ద పెద్ద కాలనీల్లో కూడా లంగ్ స్పేస్ లేని దుస్థితి ఏర్పడుతున్నది. రియల్టర్లు కూడా ఏ మాత్రం పచ్చదనానికి ప్రాధాన్యం ఇవ్వకుండా అగ్గిపెట్టెలు పేర్చినట్టు విల్లా లు, ఇండ్లు, అపార్టుమెంట్లు నిర్మిస్తున్నారు. మన నగరం చుట్టూ నిర్మిస్తున్న విల్లాలలో సగానికి పైగా గెట్టోల మాదిరిగా ఉన్నాయి తప్ప ఏమాత్రం లంగ్‌స్పేస్ ఉండడం లేదు. రాబోయే తరాలకు మనం ఇవ్వగలిగినంత గాలి, నీరు ఇస్తున్నామా లేదా అన్నది ఆలోచించాలి. ప్రతి అడుగు భూమిని డబ్బుచేసుకోవడం ఒక్కటే లక్ష్యం కాకూడదు. ఈ పరిస్థితులన్నీ చక్కదిద్దడానికి ఒక సమగ్రమైన చట్టం అవసరం. రెవెన్యూ మొదలు పంచాయతీల వరకు భూమికి సంబంధించి ఒకటే సమగ్ర చట్టం తీసుకురావాలన్నది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తున్నది. భూమికి సంబంధించిన చట్టాల్లో సంస్కరణ తేవడం అన్నది కోట్లాదిమంది ప్రజలకు సంబంధించిన అంశం. ఒకే భూమికి సంబంధించి అనేక శాఖలకు అధికారాలను కట్టబెట్టే పాత గొంగడిని తగలబెట్టకుండా కొత్త చట్టం రూపొంద దు. ఇది ఉద్యోగులు, ఉద్యోగాల పంచాయితీ కాదు. ఒక దీర్ఘకాలిక ఆలోచన. అందరూ ఈ కృషిలో భాగస్వాములు కావాలి.

Source:

KATTA-MEETA

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat